calender_icon.png 19 June, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర జలశక్తి మంత్రితో నేడు భేటీ

19-06-2025 01:45:06 AM

  1. బనకచర్లను అడ్డుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నం చేస్తాం..
  2. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో కలిసి మంత్రి సీఆర్ పాటిల్‌కు ఫిర్యాదు చేస్తాం 
  3. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో రాజీపడబోం
  4. సచివాలయంలో అఖిలపక్ష ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
  5. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నిరసనగా బీఆర్‌ఎస్ వాకౌట్

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): గోదావరి-బనకచర్లపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై అన్ని పార్టీల ఎంపీలు తమ అభిప్రాయా లు చెప్పారని.. ఈ ప్రాజెక్టు చేపట్టవద్దని తీర్మానం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. టెక్నికల్, లీగల్, పొలిటికల్ సహా అన్ని మార్గాల ద్వారా జీబీ లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రం వాదన వివరిస్తామని పేర్కొన్నారు. రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. గోదావరి- ప్రాజెక్టు అంశంపై అఖిలపక్ష ఎంపీలతో సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు..

ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా జల్‌శక్తి మంత్రిని, పర్యావరణమంత్రి ని, రుణాలు రాకుండా కేంద్ర ఆర్థికమంత్రిని, ప్రధానమంత్రిని, జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ, పోలవరం బోర్డును అందరినీ కలుద్దామని సీఎం పిలుపునిచ్చారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వారి వారి కార్యక్రమా ల షెడ్యూల్ వల్ల ఈ సమావేశానికి రాలేకపోయారని తెలిపారు.

గురువారం కిషన్‌రెడ్డి, బం డి సంజయ్‌ను విజ్ఞప్తి చేసి వారితో కలిసి జల్‌శక్తి మంత్రికి తాను, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జీబీ లింక్‌పై ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో తీర్మానించిన అంశాలను కేంద్రానికి పంపిస్తామన్నారు. భవిష్యత్తులో ఢిల్లీలో ఎంపీలను ఈ అంశంపై సమన్వయం చేసేందుకు ఐఏఎస్ అధికారి గౌరవ్, నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ అందుబాటులో ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అంతా కలిసి ఈ ప్రాజెక్టుకును అడ్డుకుందామని పిలుపునిచ్చారు. 

బనకచర్లకు పునాది వేసిందే కేసీఆర్.. 

గోదావరి జలాలను రాయలసీమకు తరలించటంపై 2019 అక్టోబరులోనే అప్పటి సీఎంలు కేసీఆర్, జగన్ కలిసి చర్చించుకున్నారని..అప్పుడే గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ఆలోచన పురుడుపోసుకుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 2016లో కేంద్రమంత్రి ఉమాభారతి అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిదని..

ఈ సమావేశంలో ప్రతిఏటా 3వేల టీఎంసీల నీరు వృథాగా గోదావరిలో కలుస్తోందని కేసీఆర్ చెప్పారని సీఎం గుర్తుచేశారు. 3వేల టీఎంసీలు వృథాగా పోతున్నా యని మొదట మాట్లాడింది ఆనాటి సీఎం కేసీఆరేనని పేర్కొన్నారు. రాయలసీమకు గోదావ రి జలాల తరలింపులో సహకరిస్తామని కేసీఆర్ పేర్కొన్నట్టుగా నమస్తే తెలంగాణ దిన పత్రికలో రాశారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

రాయలసీమను రతనాలసీమ చేస్తామని ఆనాటి సీఎం కేసీఆర్ ప్రకటించారని..గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలని కేసీఆర్, జగన్ ప్రగతిభవన్‌లో నాలుగుసార్లు సమావేశమై నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇరురాష్ట్రాల సీఎంల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటల రాజేందర్, బుగ్గన రాజేంద్రప్రసాద్ ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారని గుర్తుచేశారు. ఈ మీటింగ్ మినిట్స్‌ను రిఫరెన్స్‌గా చూపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు బనక చర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు.

ఇందుకు సంబంధించి అఫీషియల్ డాక్యుమెంట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలు ఉన్నా రైతుల విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. జీబీ లింక్ వ్యవహారంపై ఎలా ముందుకు వెళ్ల్లాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు వివరించారు. రాష్ట్రానికి గోదావరి, కృష్ణా నదులే జీవనాధారమని, తమ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాల కంటే ముఖ్యమైన అంశమేదీ లేదని స్పష్టం చేశారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఆ సమావేశంలో హరీశ్‌రావు కూడా పాల్గొన్నారని తెలిపారు.

ఆ భేటీలో ఎవరు ఏం మాట్లాడారో అంతా దస్త్రాల రూపంలో ఉందని..రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై చర్చించుకున్నామని ఆనాడు తెలంగాణ, ఏపీ మంత్రులు మీడియాకు కూడా చెప్పారని రేవంత్‌రెడ్డి చెప్పారు. జీబీ లింక్‌పై అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు. నీటి ఒప్పందాలపై నిపుణులైన న్యాయవాదులను నియమించుకుంటామని పేర్కొన్నారు.

జీబీ లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించామన్నారు. తెలంగాణకు కృష్ణాలో 299టీఎంసీలు సరిపోతాయని ఆనాడు కేసీఆర్ ఒప్పుకొని సంతకం చేశారని..ఆనాడు కేసీఆర్ చేసిన సంతకం నేడు తెలంగాణకు ప్రతిబంధకంగా మారిందని అన్నారు. 

బీఆర్‌ఎస్ వాకౌట్..

బనకచర్ల అంశంపై విలేకరుల సమావేశం లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మీడియా సమావే శం నుంచి వాకౌట్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ర్ట ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రా ధాన్యమిస్తున్నారని ఆయన ఆరోపించారు. కృ ష్ణానది మార్గం ద్వారా నాగార్జున సాగర్, శ్రీ శైలం ద్వారా గోదావరి జలాలు తరలించే అం శంపై ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం జరిగితే.. దాన్ని పోలవరం ఆపాది స్తూ బీఆర్‌ఎస్‌పై దుష్ర్పచారం చేయడానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

రైతుల ప్రయోజనాలే ముఖ్యం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో మంత్రి ఉత్తమ్ 

రాష్ట్ర రైతుల ప్రయోజనాలే తమకు అన్నింటికన్నా ముఖ్యమని నీటిపారుదలశాఖ మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి లింక్ ప్రాజెక్టుపై అన్ని పార్టీల తో చర్చలు జరుపుతున్నామన్నారు. జీబీ లింక్ పై సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తూ కీలక అంశాలను వివరించారు. జీబీ లింక్ ప్రాజెక్టు తెలంగాణ నీటిహక్కులకు భంగం కలిగిస్తోందన్నారు.

ఏపీ విభజన చట్టాన్ని కూడా ఈ ప్రాజెక్టు ఉల్లంఘిస్తోందన్నారు. జీబీ లింక్‌పై ఏపీ కేంద్రానికి ప్రీ ఫీజబులిటీరిపోర్టు (ఎఫ్‌పీఆర్) ఇచ్చిందని..దీనిపై స్పందించాలని కేంద్రం తెలంగాణను కోరిందన్నారు. అలాగే కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలతో పాటు ఈ బేసిన్ పరివాహక ప్రాంతాల రాష్ట్రాలకు పంపించిందన్నారు. 15 రోజుల్లో అభిప్రాయాలను చెప్పా లని కోరారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అభ్యంతరం చెబుతూ ప్రాథమికంగా లిఖితపూర్వకం గా తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందన్నారు.

బనకచర్ల ప్రాజెక్టు ప్రపోజల్ వల్ల విభజన చట్టం ఉల్లంఘించినట్లు అవుతున్నదన్నారు. జీబీ లింక్ ఏ విధంగా అక్రమ ప్రాజెక్టో వివరిస్తూ పూర్తి స్థాయి నివేదికను కేంద్రానికి తాము సమర్పిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాను గురువారం ఢిల్లీ వెళ్లి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయి రాష్ర్ట అభ్యంతరాలను తెలుపుతామన్నా రు. బనకచర్లపై ఎంపీల అభిప్రాయాలు చాలా కీలకమని అన్నారు.

బనకచర్ల రిజర్వాయర్ ప్రకాశం జిల్లాలో పెన్నా బేసిన్ లో ఉందని.. గోదావరి జలాలను పెన్నా బేసిన్‌కు తరలించాలని ఏపీ భావిస్తోందన్నారు. పెన్నాలోకి గోదా వరి జలాలు తరలించి రాయలసీమకు నీరు ఇచ్చే ప్రణాళికతో ఏపీ ఉందన్నా రు. గోదావరి జలాలను అక్రమంగా కృష్ణా, పెన్నా బేసిన్‌లోకి తరలిస్తున్నారని తెలిపారు. గోదావరి అనుసంధానించి 200 టీఎంసీలు వాడుకునేందుకు ఏపీ ప్రణాళికలు చేస్తోందన్నారు. రోజుకు మూడు టీఎంసీలు తరలించే 7.41 లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రణాళికతోనే జీబీ లింక్ చేపట్టినట్లు పేర్కొన్నారు. 

హాజరైంది వీరే..

బనకచర్లపై ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు రేణుకాచౌ దరి, మల్లు రవి, బలరాం నాయక్, సురేశ్ షెట్కర్, కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, రఘురాంరెడ్డి, బీజేపీ నుంచి ఎంపీలు డీకే అరుణ, రఘునందన్‌రావు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్‌ఎస్ నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ 

బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో కలిసి జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలుస్తామని సీఎం తెలిపారు. జల్‌శక్తి మంత్రిని కలిసి బనకచర్లను అడ్డుకునేందుకు గాను రావాలని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు విజ్ఞప్తి చేశామని అన్నారు. రెండు మూడు రోజులు ఢిల్లీలో ఉండి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అందరిని కలిసి తెలంగాణ ప్రయోజనాలను కాపాడతామని సీఎం స్పష్టం చేశారు.