calender_icon.png 6 June, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సింగ్ ఫ్యాకల్టీ నియామకమెప్పుడు?

05-06-2025 01:10:38 AM

  1. రెగ్యులర్ నర్సులను ఫ్యాకల్టీగా కొనసాగిస్తున్న సర్కారు
  2. నర్సుల కొరతతో రోగులకు తప్పని ఇబ్బందులు
  3. రాష్ట్రంలో ఖాళీగా 560 పోస్టులు!

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రతీ జిల్లాలోనూ ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వాలు గొప్ప లు చెప్పడమే కానీ వాటిలో కనీస సౌకర్యాలు, ఫ్యాకల్టీ నియామకంలో మాత్రం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వరంగంలో 37 నర్సింగ్ కాలేజీలున్నాయి. ఇందు లో కొత్తగా 16 నర్సింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు ఈ ఏడాదే ప్రారంభమయ్యాయి.

ఈ అడ్మిషన్ల ప్రక్రియను అధికారులు మమ అనిపించారు. చాలా కాలేజీలకు భవనాలను అందుబాటులోకి తీసుకురావడంలోనూ అప్పట్లో ప్రిన్సిపల్స్ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రిన్సిపల్స్‌ను నియమించినా వారికి కనీసం ఒక్క అటెం డర్‌ను కూడా కేటాయించలేదు. ఫలితంగా తాత్కాలికంగా మెడికల్ కళాశాలలు, జిల్లా, ఏరియా హాస్పిటళ్లలో ఓ టేబుల్, చైర్, కంప్యూటర్ ఏర్పాటు చేసుకుని ప్రిన్సిపల్స్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టారు.

విద్యార్థుల అడ్మిషన్లు పూర్తయి తరగతులు ప్రారంభించిన తర్వాత ఫ్యాకల్టీ లేక ఇబ్బందులు పడుతుంటే రెగ్యులర్‌గా హాస్పిటల్స్‌లో విధులు నిర్వర్తించే నర్సింగ్ ఆఫీసర్లను డిప్యూటేషన్‌పై నియమించారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్యసేవలకు ఇబ్బందులు తప్పడంలేదు. 

కొత్త కాలేజీల్లో ఫ్యాకల్టీ సమస్య..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16నర్సింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. దీంతో మొత్తం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సంఖ్య 37కు చేరుకుంది. సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి నర్సింగ్ కాలేజీల్లో 100చొప్పున సీట్లుండగా మిగతా కాలేజీల్లో 40 నుంచి 60వరకు సీట్లున్నాయి. మొత్తం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో 2,360నర్సింగ్ సీట్లున్నాయి. ఏటా ఆ మేరకు ప్రభుత్వ కళాశాలల నుంచి నర్సింగ్ విద్యార్థులను మన రాష్ట్రం తయారుచేస్తోంది.

అయితే వీరికి నాణ్యమైన విద్య అందేందుకు నర్సింగ్ ఫ్యాకల్టీ ఎంతో కీలకం. కొత్తగా ప్రారంభమైన జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మెదక్, కుత్బుల్లాపూర్, ములుగు, నర్సంపేట, నిర్మల్, రామగుండం, మహేశ్వరం, మధిర, కొడంగల్, నారాయణపేట, యాదాద్రిభువనగిరి, నిజామాబాద్‌లో నర్సింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తయి క్లాసులు జరుగుతున్నాయి. కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటుతో  బీఎస్సీ నర్సింగ్ చేసే పేద వి ద్యార్థులకు ఎంతో మేలు అయ్యింది.

అయి తే భవనాల ఏర్పాటుతో పాటు అత్యంత కీలకమైన ఫ్యాకల్టీ నియామకం విషయంలో అధికారులు ఇంకా సరైన విధంగా స్పందించడం లేదని సమాచారం. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లను డిప్యూటేషన్‌పై ఫ్యాకల్టీగా నియమించారు. అయితే ఈ నియామకం వల్ల ఆయా ఆస్పత్రుల్లో నర్సింగ్ ఆఫీసర్ల సేవలు కోల్పోవాల్సి వచ్చింది. ఫలితంగా పేదరోగులకు నర్సింగ్ సేవలపై ప్రభావం పడుతోం దని వైద్యులు అంటున్నారు.

వైద్యరంగంలో తాత్కాలిక సర్దుబాట్లు కొన్ని రోజులు ఓకే కానీ నెలల తరబడి అంటే చాలా కష్టమన్నది వైద్యుల అభిప్రాయం. ఇక నర్సింగ్ ఫ్యాకల్టీ నియామకం కోసం వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లలో అర్హత ఉన్న వారి సీనియారిటీ జాబితా తయారు చేసినా..ఆ ఫైల్‌ను కదిలించకుండా ఓ అధికారి అట్టిపెట్టుకున్నట్లు సమాచారం.

ఈ ఫైల్ కదిలితే ప్రస్తుతం నర్సింగ్ ఆఫీసర్లుగా ఉన్న వారిని నర్సింగ్ ఫ్యాకల్టీగా నియ మించేందుకు అవకాశం ఏర్పడుతుంది.  సదరు అధికారి ఒకరు ఫైల్ మూ వ్ చేసేందుకు నర్సింగ్ ఆఫీసర్ల నుంచి ఆ మ్యా మ్యా లు ఆశిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. 

రాష్ట్రంలో 560 నర్సింగ్ లెక్చరర్ (డీఎల్) పోస్టుల ఖాళీ..

రాష్ట్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులు డీఎల్ (నర్సింగ్)560 ఖాళీలు ఉన్నాయని సమాచారం. ఈ ఖాళీలను భర్తీ చేయాల్సిన వైద్యఆరోగ్యశాఖ ప్రస్తుతానికి సుమారు 200మంది నర్సింగ్ ఆఫీసర్లను డిప్యూటేషన్‌పై నియమించుకున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకుండా తాత్కాలిక ఏర్పాట్ల ద్వారా తరగతులు బోధించడం కష్టంగా ఉంటోందని నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖాళీలకు సరిపడా డిప్యూటేషన్లు లేవని చాలాపోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నర్సింగ్ ఆఫీసర్ల సీనియారిటీ జాబితా సిద్ధం చేసి ఫ్యాకల్టీ నియామకం చేయాలని వైద్యమంత్రి చెబుతున్నా ఈ విషయంలో కొందరు అధికారులు మంత్రిని తప్పుదారి పట్టిస్తున్నారని నర్సింగ్ ఆఫీసర్లు అంటున్నారు. ఈ అంశంపై నర్సింగ్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ సుస్మిత వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.