05-06-2025 01:06:35 AM
నిర్మల్, జూన్ 4 (విజయక్రాంతి)/ఖానాపూర్: భూ భారతి సదస్సులో సమస్యను విన్నవించేందుకు వచ్చిన ఓ వృద్ధ రైతును క్యూలో రాలేదన్న సాకుతో మెడపట్టి గెంటేశాడు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఏఎస్సై రాంచందర్. దీనిపై మంత్రి సీతక్క, ఉన్నతాధికారులు సీరియస్ కావడంతోపాటు ఏఎస్సైను సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్నది. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలో బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు.
రైతులందరూ వచ్చి క్యూలో నిల్చొని సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అల్లెపు వెంకట్ అనే 70 ఏళ్ల రైతు తన సమస్యను అధికారికి విన్నవించేందుకు వచ్చాడు. వయసు రీత్యా క్యూలో నిలబడే ఓపిక లేకపోవడంతో తాను అధికారులను కలుస్తానని అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి చెప్పినా వారు వినలేదు. ఆ తర్వాత వెంకట్ క్యూలో కాకుండా పక్కదారిలో అధికారుల వద్దకు వెళ్లాడు.
అప్పటికీ అర్జీలు స్వీకరిస్తూ పని ఒత్తిడిలో ఉన్న సిబ్బంది వెంకట్ను క్యూలో రావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు క్యూలో నిలబడే ఓపిక లేదని వెంకట్ విన్నవించాడు. వినిపించుకోని రెవెన్యూ అధికారులు అతన్ని బయటకు పంపాలని పోలీసులకు సూచించారు.
అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై రాంచందర్ వెంకట్ను అధికారుల నుంచి మెడపట్టి బలవంతంగా లాక్కెళ్లి బయటకు గెంటివేశాడు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అధికారులను కలిసేందుకు వస్తే తనను ఈ విధంగా గెంటేస్తారా అంటూ రైతు తన ఆవేదనను వెళ్లగక్కాడు.
ఏఎస్సై సస్పెన్షన్
రైతు పట్ల ఏఎస్సై ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు రావడంతో పోలీస్ శాఖ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఘటనపై విచారణ జరిపి డీజీపీకి ప్రాథమిక నివేదికను అందించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఎస్సై రాంచందర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. కాగా ఈ ఘటనపై నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల సమగ్ర విచారణ ప్రారంభించారు.
ఘటనపై మంత్రి సీతక్క ఆరా
ఈ ఘటనపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆరా తీశారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిలను ఆదేశించారు. భూభారతి సదస్సులో రైతుల పట్ల ఇలా ప్రవర్తించడంపై పోలీస్ శాఖకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ప్రభుత్వ ప్రోద్బలంతోనే: హరీశ్రావు
రైతు వెంకట్పై ఏఎస్సై రాంచందర్ వ్యవహించిన తీరును మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావురావు తీవ్రంగా ఖండించారు. భూ సమస్యను పరిష్కరించుకునేందుకు వచ్చిన రైతుపై రెవెన్యూ అధికారుల సాక్షిగా పోలీసులు మెడబెట్టి గెంటేయడం ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరిగిందని ఆరోపించారు. రైతులకు క్షమాపణ చెప్పి, రైతు సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.