21-01-2026 01:44:29 AM
ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్లర్లతో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్
నేడు నిజామాబాద్, ఖమ్మం వరంగల్.. రేపు నల్లగొండ, మహబూబ్నగర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): మున్సిపల్, కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 24 లేదా 27న విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. ఎన్నికల ఏర్పాట్లు, ఓటరు జాబితాల రూపకల్పన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించారు. బుధవారం ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతున్నారు.
గురువారం ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల కలెక్టర్లతో, 23న రంగారెడ్డి, మేడ్చల్, ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు, సిబ్బంది నియామకం, శాంతిభద్రతల పరిరక్షణ వంటి కీలక అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.