calender_icon.png 21 June, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర తీరాన 5 లక్షల మందితో

21-06-2025 01:43:42 AM

  1. నేడు విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
  2. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా యోగాంధ్ర-2025
  3. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 34 కిలోమీటర్ల మేర కార్యక్రమం
  4. ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్న ప్రధాని మోదీ
  5. హాజరవనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విశాఖపట్నం, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘యోగాంధ్ర-2025’ పేరిట ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. శనివారం (జూన్ 21న)విశాఖపట్నం సాగర తీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే విశాఖ పట్నం చేరుకున్నారు.

కార్యక్రమంలో మోదీతో పాటు  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా యోగాసనాలు వేయనున్నారు. విశాఖ సాగర తీరాన సుమారు 5 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తద్వారా గిన్నిస్ రికార్డు సాధించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. యోగా కార్యక్రమం కోసం విశాఖ ఆర్కే బీచ్‌లోని కాళీమాత ఆలయం నుంచి భోగాపురం వరకు సుమారు 34 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని యోగా వేదికగా తీర్చిదిద్దారు.

బీచ్ రోడ్డులో మొత్తం 326 కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేశారు. యోగాసనాల్లో పాల్గొనేవారికి ఉచితంగా యోగా మ్యాట్, టీ షర్టులు అందజేయనున్నారు. సుమారు 62 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒకవేళ శనివారం వర్షం కురిస్తే కార్యక్రమానికి అంతరాయం కలగకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ప్రత్యామ్నా య ఏర్పాట్లు పూర్తి చేశారు. 

మోదీకి ఘనస్వాగతం

బీహార్, ఒడిశా పర్యటన ముగించుకున్న భారత ప్రధాని శుక్రవారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు సమీపంలోని నౌకాదళ అతిథి గృహంలో బస చేయనున్న మోదీ.. యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు నేడు ఉదయం ఆర్కే బీచ్‌కు చేరుకుంటారు. యోగాసన కార్యక్రమం ముగిసిన తర్వాత ఉదయం 11.50 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనమవ్వనున్నారు.