01-06-2025 11:01:27 PM
ఈత రాక నీటమునిగి మహిళ గల్లంతు..
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో ఘటన..
రాత్రి వరకు చెరువులో కొనసాగిన గాలింపు చర్యలు..
లభ్యం కానీ మహిళా మృతదేహం..
ఇబ్రహీంపట్నం: ఈత సరదా ఓ మహిళ ప్రాణం తీసింది. సరదా కోసం చెరువులోకి వెళ్లి ఈత రాక నీటమునిగి మహిళ గల్లంతైంది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్(Ibrahimpatnam Police Station) పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఫలక్నుమాకు చెందిన రేష్మా(35), బాలాపూర్ కు చెందిన ఖాసీం, డిఆర్డిఎల్ సమీపంలో ఉండే కేశవ, బర్కస్ కు చెందిన ఖాసీం, ఉప్పుగూడకు చెందిన రవి కూలీపని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. కాగా, ఐదుగురు కల్లు కాంపౌండ్ దగ్గర నిత్యం కలుసుకునేవారు.
దీంతో వీరు ఐదుగురు స్నేహితులుగా మారారు. కాగా ఐదుగురు కలిసి ఆదివారం ఆటోలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుపై ఉన్న ఇబ్రహీం పాషా దర్గాకు సాయంత్రం వచ్చి దర్శనం అనంతరం.. తిరుగు ప్రయాణంలో పెద్ద చెరువుపై కొంతసేపు సరదాగా గడపడానికి వారు ఆగారు. కాగా వారిలో ఖాసీం, రేష్మాలు ఇద్దరు సరదాగా స్నానం కోసం చెరువులోకి వెళ్లారు. ఖాసీం చెరువులో నుంచి ఇదుకుంటూ బయటకు రాగా, రేష్మాకు ఈత రాక చెరువులో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహం కోసం పోలీసులు రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం లభ్యం కాలేదు.