calender_icon.png 3 June, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారోద్దు

01-06-2025 10:51:50 PM

సమాజసేవ బాధ్యతగా భావించాలి..

టెక్నాలజీని యువత అందిపుచ్చుకోవాలి.. 

డిసిపి మధుకర్ స్వామి...

దౌల్తాబాద్ (విజయక్రాంతి): యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి భవిష్యత్తును పణంగా పెట్టోద్దని డీసీపీ మధుకర్ స్వామి(DCP Madhukar Swamy), ప్రొఫెసర్ కే హుస్సేన్(Professor K Hussain) పేర్కొన్నారు. దుబ్బాకలో తౌడ సత్యనారాయణ సారధ్యంలో అఖిల రాజ్ ఫౌండేషన్ ఆవిర్భావ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా మారాల్సిన అవసరం ఉందని, అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు నిర్మాణానికి దృష్టి పెట్టాలని, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఆన్లైన్ అవకాశాలు ఉపయోగించుకోవాలని కోరారు.

సమాజ సేవను యువత సామాజిక బాధ్యతగా భావించాలని, అప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోతాయన్నారు. మారుతున్న కాలంలో మానవతా విలువలు పతనం అవుతున్నాయని, యువత పెద్దలను గౌరవించడం, గ్రామాలను ప్రేమించడం అలవర్చుకోవాలని సూచించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి అని ప్రపంచం ఒక గ్రామంగా మారిన నేపథ్యంలో దానికి అనుగుణమైన జ్ఞానాన్ని యువత సంపాదించడం అలవర్చుకోవాలని కోరారు. యువత బాధ్యతగా సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని, మనిషిని మనిషిగా ప్రేమించగలిగినప్పుడే మానవత్వం నిలబడుతుందని అన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను జాగ్రత్త చేయాల్సిన అవసరం స్వచ్ఛంద సంస్థలపై ఉందని, చట్టాలపై అవగాహన, మహిళల రక్షణ, ఆధునిక వ్యవసాయం లాంటిపై దృష్టి సారించాలని కోరారు. సమాజంలో విద్య అందరికీ సమానంగా అందినప్పుడు పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందని, నిరుపేద విద్యార్థులకు విద్య అందడానికి  స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అఖిల రాజ్ ఫౌండేషన్ సమాజానికి పూర్తివంతమైన కార్యక్రమాలు నిర్వర్తించి సమాజంలో తనదైన పాత్రను పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్సై తౌడ సత్యనారాయణ మాట్లాడుతూ... తాను పుట్టి పెరిగిన పరిస్థితుల ప్రభావం తనపై అపారంగా ఉందని, తాను చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టాలు మరెవరు ఎదురుకోవద్దని భావించి ఈ సంస్థను స్థాపించినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద విద్యార్థులకు చేయూత ఇవ్వడమే ఈ సంస్థ ప్రధాన ఆశయమని అన్నారు.

సమాజంలో నిరాశకు గురి అవుతున్న వృద్దులు, క్షణికావేశంతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు వారిని అక్కున చేర్చుకొని ఫౌండేషన్ వారిని ఆదరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఇనిస్ట్యూట్ కరస్పాండెంట్ భాగ్య కిరణ్, వలి, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జక్కుల వెంకట్, ఓయూ నాయకులు శ్రీకాంత్, కేయూ నాయకులు శివకుమార్, వర్తక సంగం నాయకులు రాజు, నాగేందర్, మాజీ ఎంపిటిసి దేవేందర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మల్లయ్య, ఫౌండేషన్ నిర్వాహకులు కుంభాల రవి, రాం రెడ్డి, భాస్కర్, రాజు, సాయిలు, రవి, శ్రీనివాస్, నరేష్, భీమ్ రాజు, లక్ష్మణ్ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.