18-09-2025 10:59:34 PM
ఎల్బీనగర్: కుటుంబ సమస్యలు... ఆర్థిక సమస్యలు... భర్తతో విభేదాలతో తాగుడుకు బానిసైన వివాహిత సరూర్ నగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొల్లా సాయి కుమార్, భవానీ(28) భార్యాభర్తలు. వీరు పదేండ్ల పాటు చంపాపేటలోని డీ-మార్ట్ వెనుక వైపున దుర్గాభవాని నగర్లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ దంపతులు తరచుగా గొడవ పడుతున్నారు. ఐదు రోజులుగా సాయి కుమార్ మరొక మహిళతో ఉంటుండడంతో భవాని కల్లు తాగుతూ అతడితో గొడవ పడేది.
ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన భవానీ గురువారం సాయంత్రం సరూర్ నగర్ చెరువు దగ్గరకు కాలినడకన వచ్చి, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. రెండు రోజుల క్రితం సాయికుమార్ తన భార్యపై ఫిర్యాదు చేయడానికి సైదాబాద్లోని మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఇద్దరికీ స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న భవానీ మృతదేహం కోసం పోలీసులు, హైడ్రా బృందం, అగ్నిమాపక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదిరెడ్డి వివరించారు.