25-01-2026 07:30:55 PM
200 మందికి పైగా బాధితులు
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో గ్రామ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట మహిళలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫౌండేషన్లో చేరితే నెలకు నిత్యవసర సరుకులు, నగదు ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరినుంచి రూ.2750 చొప్పున వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
దాదాపు 200 మందికి పైగా మహిళలు డబ్బులు చెల్లించగా, ప్రారంభంలో నామమాత్రంగా సరుకులు, ఒక నెల నగదు ఇచ్చి ఆ తర్వాత చెల్లింపులు నిలిపివేసినట్లు తెలిపారు. డబ్బులు వసూలు చేసిన ఉద్యోగిని ప్రశ్నించినా స్పందన లేకపోవడంతో ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట మహిళలు బైఠాయించి న్యాయం కోరారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.