25-11-2025 06:00:50 PM
ఐఏఎస్ ఇలా త్రిపాఠి..
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎల్లవేళలా అండగా ఉంటుంది. ఎమ్మెల్యే భక్తుల ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ (విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని కళాభవన్ లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లతో కలిసి స్వయం సహాయకు మహిళ సంఘాలకు 10 కోట్ల 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ఉచిత బస్సు రాయితీతో పాటు, బస్సులు, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు, నిర్వహణ, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, పాఠశాల విద్యార్థులకు యూనిఫాం కుట్టే బాధ్యత, అమ్మ ఆదర్శ పాఠశాల పనులు అప్పగింత వంటివి ఇవ్వడం జరిగిందని అన్నారు.
బ్యాంకు లింకేజీ కింద ఇస్తున్న రుణాలు, వడ్డీ లేని రుణాల ద్వారా మహిళలు కొత్త కొత్త ఆలోచనలతో ఆర్థికంగా ఎదిగేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మిర్యాలగూడ పట్టణంలో మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకు నిర్వహణకు స్థలం చూడాలని, మహిళా సంఘాల కోసం ప్రత్యేకించి భవన నిర్మాణానికి స్థలం చూడాలని రెవెన్యూ అధికారులను ఆమె ఆదేశించారు. భవిష్యత్తులో మహిళల ద్వారా రైస్ మిల్లుల నిర్వహణకు స్థలం చూడాలన్నారు. పెన్షన్ రాని వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క ఇల్లు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల లోపు ఫ్రీ పవర్, సన్న బియ్యం, సన్నధాన్యం పండించిన రైతులకు బోనస్, మహిళలకు పెట్రోల్ బంకుల ఏర్పాటు, తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు.
మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, వడ్డీ లేని రుణాలను తీసుకొని లాభం పొందాలని, ఆర్థికంగా మహిళలు ఎదిగేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉచిత బస్సు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు, మహిళలకు పెట్రోల్ బ్యాంకుల నిర్వహణ, బస్సుల నిర్వహణ, చీరల పంపిణీ వంటివి చేపట్టడం జరిగిందని, దీంతో మహిళలందరు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ,డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, అధికారులు,ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.