విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలి
సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోని ప్రజలకు సేవలు అందించాలి...
ట్రైనింగ్ పూర్తి చేసుకొని విధులు నిర్వహించటానికి సిబ్బందికి సూచనలు..
జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు
గద్వాల (విజయక్రాంతి): విధి నిర్వహణలో అంకిత భావంతో పని చేస్తూ, ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోని ప్రజలకు సేవలు అందించాలనీ జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ట్రైనింగ్ పూర్తి చేసుకొని కొత్తగా విధుల్లో చేరనున్న కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు. జోగుళాంబ గద్వాల్ జిల్లా నుండి 72 ( మహిళలు -25 ) సివిల్, 33 ఏఆర్ ( మహిళలు - 5) కలిపి మొత్తం 105 (మహిళలు - 30) మంది సెలెక్ట్ అయి 9 నెలల కఠినమైన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించడానికి వచ్చిన నేపథ్యంలో సోమవారం వారితో ఎస్పీ సమావేశం అయ్యి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పని చేయడం అనేది ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ సేవ చేసే గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. పోలీసుశాఖ మిగిలిన ఇతర ప్రభుత్వ ఉద్యోగాలతో పోలిస్తే ఎంతో భిన్నమైనదని, ఎన్నో సవాల్లతో కూడుకున్నదని, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. నూతన కానిస్టేబుళ్లకు ఉన్నతాధికారుల నుండి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయని, సూచనలకు ఆదేశాలకు అనుగుణంగా క్రమశిక్షణతో పని చేయాలనన్నారు.
నూతన కానిస్టేబుళ్లు అందరికీ 15 రోజుల పాటు రైటర్, కోర్టు డ్యూటీ, భరోసా, సఖి, షి టీం, రిసెప్షన్, CCTNS, బీట్ సిస్టం, వెహికల్ చెకింగ్, కార్డన్ అండ్ సెర్చ్, డయల్ -100 కాల్స్ అటెండ్, ఔట్ డోర్ ట్రైనింగ్, బందోబస్తు, జిల్లా పోలీస్ కార్యాలయంలోని వివిధ విభాగాలలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు రికార్డు వర్క్ నేర్చుకోవాలని, అలాగే అన్ని వర్టీకల్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. 15 రోజుల ట్రైనింగ్ అనంతరం వారి వారి శక్తి సామర్ధ్యాలకు, విభిన్న నైపుణ్యాలకు తగినట్టుగా వివిధ పోస్టులలో అవకాశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. కాలానుగుణంగా నేరాల తీరు మారుతుందని ప్రస్తుతం సైబర్ క్రైమ్, డ్రగ్స్ నేరాలు పెరిగాయని, రోజురోజుకీ పెరుగుతున్న సైబర్ క్రైమ్ వంటి సాంకేతికపరమైన నేరాల నేపథ్యంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని అటువంటి చదువులు చదివిన వారికి సైబర్ క్రైమ్, ఐటి సెల్ వంటి విభాగాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
నేర నియంత్రణలో శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యున్నత స్థాయిల జిల్లలో పోలీసులు వినియోగిస్తున్నారని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. బాధతో పోలీసు స్టేషన్కు వచ్చే వారికి మేమున్నామనే భరోసా కల్పించాలని , విధి నిర్వహణలో కమ్యూనిటీ పోలీసింగ్కు ప్రాధాన్యమివ్వాలన్నారు. పోలీసు శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపిక చేయబడిన ప్రతి ఒక్కరు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కె.గుణ శేఖర్, ఆర్.ఐ వెంకటేష్, ఎస్బి ఎస్సై శ్రీనివాస్, ఆర్ ఎస్సై చంద్ర కాంత్ తదితరులు పాల్గొన్నారు.




