నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను తుడిచిన కార్మికులు
కార్పొరేషన్ ప్రాంగణంలో సొమ్మసిల్లిన కార్మికులు.. నెలకొన్న ఉద్రిక్తత
నిజామాబాద్, మార్చి 17 (విజయ క్రాంతి): తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్మికులకు కార్మిక సంఘం టీయూసీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల నాయకులు మద్దతు తెలిపరు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య విభాగంలో, ఔట్సోర్సింగ్ విభాగంలో కార్మికులతో ఇప్పటికే కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు ఉన్నాయన్నారు.
ఇవి కాకుండా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో 330 మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వాటర్ వరక్స్ కార్మికులు డ్రైవర్లు, సీఐజీ గ్రూపులలో లేరన్నారు. వీరిని మాత్రమే కొత్తగా గ్రూప్లుగా చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న సీఐజీ గ్రూప్లను రద్దుచేసి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయడంతో కార్మికులపై పనిభారం జరుగుతుందని కార్మిక సంఘాల ఆరోపించాయి. కొత్త గ్రూప్లు ఏర్పాటు చేస్తే కార్మికులపై పనిభారం పెరుగుతుందని నాయకులు అన్నారు.
ఇప్పటికే ఉన్న సీఐజీ గ్రూపులను కొనసాగిస్తూ, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ 330 మంది, వాటర్ వరక్స్ కార్మికులను 25 నుంచి 35 మందితో ఒక గ్రూప్గా ఏర్పాటు చేయాలన్నారు. పాత సీఐజీ గ్రూపులను కదపాలని చూస్తే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. అదేవిధంగా ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ యూనిఫాంలు, సబ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు ఇవ్వాలని, కేటగిరీల వారీగా ఇతర మున్సిపల్ కార్పొరేషన్లో ఇస్తున్నట్లు వేతనాలు చెల్లించాలని, పీఎఫ్ ఈఎస్ఐలలో ఉన్న తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా నాయకులు కిరణ్, లింగం, ఏఐటీయూసీ జిల్లా నాయకులు భానుచందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో కొందరు కార్మికులు సోమసిల్లిపోయారు.. కార్పొరేషన్ కార్యాలయాన్ని మున్సిపల్ కార్మికులు ముట్టడించిన క్రమంలో కొందరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి కార్మికులందరూ మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించడంతో తోపులాట జరిగింది. ఈ సంఘటనతో మహిళా కార్మికులు సృహ తప్పి పడిపోయారు వారిని వెంటనే అక్కడే నిరసన కార్యక్రమంలో ఉన్న తోటి కార్మికులు వారిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.




