25-09-2025 01:00:35 PM
హైదరాబాద్: తెలంగాణ వాది, ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్(Writer Kompelli Venkat Goud) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలంగాణ సాహితీ లోకం విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జీవితం, అనుభవాలను ''వొడువని ముచ్చట'' పుస్తక రూపంలో ప్రజల ముందుకు తీసుకువచ్చారు. తెలంగాణకు చెందిన నీటి పారుదల నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఆర్. విద్యాసాగర్ రావు ఆలోచను ''నీళ్ల ముచ్చట''గా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి ఘనత చాటారు. ప్రముఖ సాహితీవేత్త అయిన నోముల సత్యనారాయణ వంటి ప్రముఖుల జీవితాలను కూడా కొంపెల్లి వెంకట్ గ్రంథస్తం చేశారు. గౌడన్నల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను అక్షర బద్ధం చేసి నేటి తరానికి అందించిన ఘనత ఆయనకే సొంతం. తన జీవిత కాలంలో తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో వెంకట్ గౌడ్ కీలక పాత్ర పోషించారు. తన రచనలతో బడుగు బలహీనవర్గాలకు అన్ని విధాలుగా అభివృద్ధి కలగాలన్న ఆలోచనతో తన సాహిత్య జీవితాన్ని కొనసాగించారు. తెలంగాణ తత్వం, ఉద్యమ స్పూర్తి తన కలంలో నింపుకొని ఎన్నో రచనలు చేసిన ఆయన కృషి చిరస్మరణీయమని పలువురు నాయకులు కొనియాడారు. కొంపెల్లి వెంకట్ గౌడ్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంతాపం తెలిపారు.
ప్రముఖ రచయిత, తెలంగాణ వాది కొంపల్లి వెంకట్ గౌడ్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. ''ప్రముఖ రచయిత, తెలంగాణ మట్టిబిడ్డ కొంపల్లి వెంకట్ గౌడ్ ఇక లేరన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి హఠాన్మరణం తెలంగాణ సాహిత్య రంగానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ జీవితాన్ని, అనుభవాలను "వొడువని ముచ్చట"గా తెలంగాణ ప్రజలకు అందించిన వెంకట్ మరోవైపు ఆర్. విద్యాసాగర్ రావు ఆలోచనలను "నీళ్ల ముచ్చట"గా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి ఇద్దరు మహానుభావుల ఆలోచనలను శాశ్వతంగా పదిల పరిచారు. వీరితో పాటు ప్రముఖ సాహితీవేత్త నోముల సత్యనారాయణ వంటి ప్రముఖుల జీవితాలను కూడా గ్రంథస్తం చేశారు. తన జీవితకాలం ఆద్యంతం తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంపల్లి వెంకట్ గౌడ్ పోషించిన పాత్ర అద్వితీయం. అంతే కాకుండా, తన రచనల ద్వారా బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా అభ్యున్నతి కలగాలన్నఆలోచన విధానంతో తన సాహిత్య జీవితాన్ని సాగించారు. గౌడన్నల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి, సర్వాయి పాపన్న చరిత్రను అక్షరబద్ధం చేసి ఈ తరానికి అందించారు. తెలంగాణ తత్వం, ఉద్యమ స్ఫూర్తిని తన కలంలో నింపుకొని ఎన్నో రచనలు చేసిన ఆయన కృషి చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.'' అంటూ కేటీఆర్ ఎక్స్ లో పోస్టు చేశారు.
కొంపెల్లి వెంకట్ గౌడ్ మృతి పట్ల హరీశ్ రావు సంతాపం
''ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ హఠాన్మరణం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ప్రొఫెసర్ జయశంకర్ మనో గతానికి 'వొడువని ముచ్చట' గా, ఆర్ విద్యాసాగర్ రావు ఆలోచనలకు 'నీళ్ల ముచ్చట' గా పుస్తక రూపం ఇచ్చారు. గౌడన్నల ఆత్మగౌరవాన్ని తన రచనల ద్వారా చాటి, సర్వాయి పాపన్న చరిత్రను అక్షర బద్దం చేసి ప్రజలకు అందించారు. తెలంగాణ తత్వం, ఉద్యమ భావజాలాన్ని తన కలంలో నింపుకున్న కొంపెల్లి వెంకట్ గౌడ్ మృతి తెలంగాణ సాహిత్య రంగానికి తీరని లోటు.'' అంటూ హరీశ్ రావు ఎక్స్ లో పోస్ట్ చేశారు.