నేడు తెరుచుకోనున్న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో కొలువైన శ్రీ గంగోత్రి, యమునోత్రి ఆలయాల ద్వారాలు, అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తుల దర్శనార్థం తెరచుకోనున్నాయి. గంగోత్రి ఆలయ ద్వారాలు మధ్యాహ్నం 12:15 గంటలకు, యమునోత్రి ఆలయ ద్వారాలు మధ్యాహ్నం 12:35 గంటలకు తెరచుకుంటాయి. దీనితో, రాష్ట్రంలో చార్ ధామ్ యాత్ర లాంఛనంగా ప్రారంభం కానుంది. ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాల ద్వారాలను తెరిచే ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. ఈ రెండు ఆలయాలను అనేక క్వింటాళ్ల పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు.
ఇంతలో, గంగాదేవి ఉత్సవ డోలి నిన్న మధ్యాహ్నం ముఖ్బాలోని శీతాకాల నివాసం నుండి గంగోత్రి ఆలయం వైపు బయలుదేరింది. దీనికి సైనిక బృందం, స్థానిక వాద్య పరికరాల సంగీతం తోడుగా నిలిచాయని ఆలయ కమిటీ వెల్లడించింది. ఆలయ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం... భైరోన్ఘాటి వద్ద రాత్రి బస చేసిన అనంతరం, పల్లకి ఈ ఉదయం గంగోత్రి ఆలయానికి చేరుకుంటుంది. అదేవిధంగా, యమునాదేవి ఉత్సవ పల్లకి కూడా ఈ ఉదయం ఖర్సాలి నుండి యమునోత్రి ఆలయానికి బయలుదేరుతుంది. ఈ పల్లకీలు ఆయా ఆలయాలకు చేరుకున్న తర్వాత, వేసవి కాలం నిమిత్తం ఈ మధ్యాహ్నం రెండు ఆలయాల ద్వారాలు తెరుచుకుంటాయి.
గంగోత్రి ఆలయ ద్వారాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరుకానున్నారు. యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం, భద్రతా దృష్ట్యా అన్ని ఆలయాల వద్ద అత్యాధునిక కెమెరాల ద్వారా నిఘా ఉంచబడుతుందని, తగినంత మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు మోహరించారు. అంతేకాకుండా, యాత్రా మార్గాల్లోనూ, పుణ్యక్షేత్రాల వద్ద తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, విశ్రాంతి గృహాలకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేశారు. కేదార్నాథ్ ఆలయ ద్వారాలు ఏప్రిల్ 22న, బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఏప్రిల్ 23న ఉదయం 6:15 గంటలకు తెరుచుకుంటాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే అనుమతి ఇవ్వబడుతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.






