28 February, 2026 | 3:48 PM

చదువుపై పూర్తి ఏకాగ్రత పెట్టాలి

28-02-2026 02:04 AM

జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య 

సంగారెడ్డి, ఫిబ్రవరి 27:  పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. శుక్రవారం జిల్లాలోని కంది మండలం కాశీపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (మైనార్టీ ), అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించారు. క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు.

స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయా, సిలబస్ పూర్తి అయ్యిందా అనే అంశాలపై విద్యార్థుల నుండి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించిన కలెక్టర్ ప్రతి రోజు శుభ్రత తప్పనిసరిగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, పంచాయతీ సెక్రటరీ, ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.