24 July, 2026 | 1:52 PM

అమెరికాలో రోడ్డుప్రమాదం: నిర్మల్ యువకుడు మృతి

24-07-2026 01:16 PM

నిర్మల్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నిర్మల్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువకుడు తన పుట్టినరోజే చనిపోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. మరణించిన వ్యక్తిని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డిగా గుర్తించారు. సమాచారం ప్రకారం, జూలై 18న బైకుపై వెళ్తుండగా ఒక కారు ఢీకొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

అతని పుట్టినరోజైన జూలై 23న, స్నేహితులు ఆసుపత్రిలోనే అతనితో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే, కొద్ది నిమిషాల్లోనే అతని ఆరోగ్యం క్షీణించి, చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కారణంగా మృతిమరణించాడు. నిత్యానంద ఉన్నత విద్య కోసం మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అతని భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.