14-06-2025 12:53:00 AM
మృతుడు రామాయంపేట నివాసి
రామాయంపేట, జూన్ 13 : ముంబై పట్టణంలో సముద్రంలో సరదాగా కుటుంబ సభ్యలతో బోటు షికారు చేసిన యువకుడు కుటుంబం చూస్తుండగానే సముద్రంలో కొట్టుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిని టంకరి రాము(34) సెంట్రింగ్ పనులు నిర్వహించేవారు.
తన సోదరిని ముంబైలో దించడానికి గురువారం వెళ్ళాడు. అక్కడ కుటుంబంతో కలిసి సరదాగా బోటు షికారు చేసి సందడి చేశాడు. అనంతరం ఒడ్డుకు వచ్చి నీటిలో ఉండగా ఒక్కసారిగా అలలు వేగంగా రావడంతో రాము సముద్రంలో మునిగిపోయాడు.
కండ్ల ముందే రాము నీటిలో మునిగిపోతున్నా ఏమీ చేయలేని దుస్థితి నెలకొందని వాపోయారు. దీంతో ఊపిరాడక రాము మృతి చెందినట్లు తెలిపారు. రాముకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాము మృతితో రామాయంపేట ఎస్సీ కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.