07-06-2025 12:09:49 AM
ఇబ్రహీం ఆశయాలు మహొన్నతమైనవి
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని ఇబ్రహీం మృతిపట్ల ఘన నివాళి
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఆపదలో, కష్టాల్లో ఉన్నవారికి తానున్నానంటూ భరోసా కల్పిస్తూ తాను స్థాపించిన ట్రస్టు ద్వారా అనేక స్వచ్చంద సేవాకార్యక్రమాలు నిర్వహించిన ఇబ్రహీం అకాల మృతి బాధాకరమని, బాధిత ప్రజలకు తీరని లోటని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం పట్టణం, ఖిద్మతే ఇన్సానియల్ ట్రస్టు వ్యవస్థాపకుడు, బూడిదగడ్డ ఏరియాకు చెందిన కూసుమంచి గ్రామం వద్ద జరిగిని రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
శుక్రవారం బూడిదగడ్డ బస్తీలో ఇబ్రహీం మృతదేహాన్ని సందర్శించిన కూనంనేని ఘననివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ... పేద కుటుంబమైనప్పటికీ ఆపదలో ఉన్నవారికి తనవంతు సహకారాన్ని అందించాలనే సదుద్దేశంతో ట్రస్టును స్థాపించి ట్రస్టు సభ్యుల సహకారంతో అనేక స్వచ్చంద సేవాకార్యక్రమాలు నిర్వహించాడు. కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకున్నాడని, కరోనా బాదితుల ప్రాణాలు కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడన్నారు.
తుఫాను, వరద భాదితులకు సహకారం అందించిందన్నారు. ట్రస్టు సేవలను మారుమూల పల్లెలకు సైతం విస్తరించి పేదలకు అండగా నిలిచాడని, అయన మహొన్నతమైన ఆశయాలను కొనసాగించేలా ట్రస్టు సభ్యులు కృషి చేయాలని సూచించారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మైనార్టీ సంఘాల రాష్ట్ర నాయకులు నయీమ్ ఖురేషి, అబిద్, అజీజ్, జమీల్, సిపిఐ నాయకులు బోయిన విజయ్ కుమార్, పల్నాటి ప్రశాంత్ తదితరులున్నారు.