బాబ్లీ గేట్లు ఎత్తివేత
పాల్గొన్న మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు.
- మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బుధవారం ఎత్తారు
బోధన్,(విజయక్రాంతి): మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బుధవారం తెరిచారు. మహారాష్ట్ర తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు, కేంద్రజల వనరుల శాఖ అధికారుల సమక్షంలో గేట్లను ఎత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూలై 1వ తేదీన బాబ్లీగేట్లు ఎత్తాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గేట్లు అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో 30వ తేదీన ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఇరు రాష్ట్రాల అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత గేట్లను తెరిచారు. దీంతో దిగువకు 0.2 టీఎంసీల నీరు ఎస్సారెస్పీ వైపు వస్తోంది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వాటర్ కమిషన్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చరణ్, జూనియర్ ఇంజినీర్లు సాయి ప్రణీత్, ప్రకాష్, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు బన్సోద్, ఓట్దార్, గవాయి, ఎస్సారెస్పీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కొత్త రవి, శ్యాం కుమార్, విన్యాస్ రెడ్డిలు పాల్గొన్నారు.






