బీఆర్ఎస్ నెగ్గినట్టా.. తగ్గినట్టా?
గులాబీ కంచుకోటలో కాంగ్రెస్ సభ విజయవంతం
రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన రైతులు
ప్రజల ప్రశ్నలకు అంతుపట్టని పరిస్థితి
హరీశ్రావు రాకపోవడంతో శ్రేణుల నిరుత్సాహం
సిద్దిపేట, మార్చి 22 (విజయక్రాంతి): బీఆర్ఎస్ కంచుకోటలో కాంగ్రెస్ సభ సక్సెస్ కావడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆదివారం జరిగిన ఆయిల్ పామ్ పరిశ్రమ ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ పంతం నెగినట్టా? తగ్గినట్టా? అనే చర్చ జోరుగా సాగింది. ఓవైపు పరిశ్రమలోనూ, నర్మేట గ్రామంలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. ఎక్కడైనా ఘర్ష వాతావరణం నెలకొంటే వెంటనే అరెస్టు చేసేందుకు పోలీసులు సర్వసన్నదంగా కనిపించారు.
కానీ ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు తామే మూలమంటూ చెప్పుకున్న బీఆర్ఎస్.. పరిశ్రమ ప్రారంభోత్సవానికి హరీశ్రావు రాకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నీరుఉత్సాహం నెలకొన్నది. కొంతమంది పార్టీ నాయకులు బహిరంగంగానే హరీశ్రావు వచ్చి ఉండాల్సింది అంటూ మాట్లాడుకున్నారు. సిద్దిపేట గడ్డపై అడుగుపెట్టిన సీఎం రేవంత్రెడ్డి తనదైన శైలిలో విమర్శలు పక్కన పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు బీజేపీ ఎంపీ రఘునందన్రావు హాజరుకావడం ఆయనకు కలిసి వచ్చింది అంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.




