ఖమ్మం రహదారులకు మహర్దశ!
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక కృషితో రూ.594 కోట్లు మంజూరు
జిల్లాలో ఐదు కీలక మార్గాల విస్తరణకు గ్రీన్ సిగ్నల్
నాలుగు వరుసల రోడ్లుగా ఆధునికీకరణ.. మారనున్న రవాణా ముఖచిత్రం
ఉగాది పండుగ పూట ఖమ్మం ప్రజలకు తీపి కబురు
కూసుమంచి, మార్చి 22(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. జిల్లా రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలకు మహర్దశ కల్పిస్తూ, జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసాధారణ చొరవ చూపారు. ఆయన పట్టుదలతో జిల్లాలోని ఐదు ప్రధాన రహదారుల విస్తరణకు (జీవో ఎంఎస్ 15 /16-03-2026) ఏకంగా రూ.594 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఈ నిధులతో కీలక మార్గాలను నాలుగు వరుసల (ఫోర్ లేన్) రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో నాలుగు నాలుగు లైన్ల రహదారులు మంజూరు కావడం, ఆ రహదారుల నిర్మాణం కావడంతో ఖమ్మం జిల్లా ముఖచిత్రమే మారిపోయింది.. ఆ రహదారులు జిల్లా అభివద్దికి కీలకంగా మారాయి.. వీటితో పాటు మరో నాలుగు నేషనల్ హైవే లు జిల్లాకు మంజూరు కావడంతో ఖమ్మం జిల్లా ముఖచిత్రమే మారిపోయే అవకాశం కనిపిస్తోంది..
భట్టి విక్రమార్క చొరవతో..
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే జిల్లా అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిలో ఈ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంలో ఆయన పాత్ర కీలకం.
ఈ రహదారుల వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు సౌకర్యవంతమైన రాకపోకలను కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను సులభతరం చేయడం లక్ష్యంగా ఈ రహదారుల విస్తరణను ప్రభుత్వం చేపడుతోంది. ఈ రదారుల విస్తరణ వల్ల ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గంలో కనెక్టివిటీ పెరగండతో పాటు స్థానికంగా ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుంది. రవాణా ఖర్చులు తగ్గడంతో రైతులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది.
అభినందనలు వెల్లువ
ఖమ్మం జిల్లాకు మరో నాలుగు పోర్ లైన్ రహదారులు మంజూరు కావడంతో ఖమ్మం జిల్లా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు పోర్ హైవే రహదారులతో అద్భుతంగా కనిపిస్తున్న ఖమ్మం జిల్లాకు మరో నాలుగు రహదారులు మంజూరు కావడంతో మహర్థశ పట్టనుంది.. రాష్ట్రంలోనే అభివద్ది చెందే జిల్లాల్లో మొదటి స్థానం ఖమ్మం జిల్లాకు దక్కే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
రహదారులు విస్తరణ..
వైరా నుండి జగ్గయ్యపేట వరకు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ నాలుగు వరుసల రహదారిగా విస్తరణ జగ్గయ్యపేట, బోనకల్, రావినూతల, ముజఫర్ నగర్, జానకీపురం, పెద్దబీరవల్లి, పాలడుగు, సీతానగరం, గొల్లపూడి, రెబ్బవరం, తాటిపూడి, జింకల తాండా. సోమవరం మీదుగా వైరా వరకు. ఈ రహదారి మొత్తం 25.2 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.151.20 కోట్ల నిధుల మంజూరు
మధిర నుంచి తూటికుంట్ల వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణ. మధిర, జిలుగుమాడు, ఆత్కూరు, కిష్టాపురం, సిరిపురం, కలకోట, బ్రాహ్యణపల్లి మీదుగా తూటికుంట్ల వరకు విస్తరణ. ఈ రహదారి మొత్తం 13.50 కిలోమీటర్ల మేర రహదారి విస్రణకు రూ. 81 కోట్ల నిధుల మంజూరు.
మధిర నుంచి ఎర్రుపాలెం వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ. మధిర, ఎల్లెందులపాడు, దెందుకూరు, మీనవోలు మీదుగా ఎర్రుపాలెం వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ. ఈ రహదారి మొత్తం 18.40 కిలోమీటర్ల మేర రూ.110.40 కోట్ల నిధులు మంజూరు.
ఖమ్మం నుంచి బోనకల్ వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ. ఖమ్మం, కొత్తూరు, దంసలాపురం, గాంధీనగరం, రామకృష్ణాపురం, పందిళ్లపల్లి, జగన్నాథపురం, నాగులవంచ, ముష్టికుంట్ల మీదుగా బోనకల్ వరకు రహదారి విస్తరణ. మొత్తంగా 28.03 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు రూ.157.23 కోట్ల నిధుల మంజూరు.
బోనకల్-ఆళ్లపాడు, రాయన్నపేట-వంగవీడు వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ. బోనకల్, ఆళ్లపాడు, రాయన్న పేట మీదుగా వంగవీడు వరకు రహదారి విస్తరణ. మొత్తంగా 15.72 కిలోమీటర్ల మేర రహదారికి విస్తరణకు రూ.94.32 కోట్ల నిధుల మంజూరు అయ్యాయి.




