సూడో నక్సల్స్ ముఠా గుట్టు రట్టు
- నలుగురు అరెస్టు
సూర్యాపేట, జూన్ 16(విజయక్రాంతి): సూడో నక్సల్స్ ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ చందనాదీప్తీ ఆదివారం వెల్లడించారు. మే 28న జిల్లాలోని గుడిపల్లి మండలం గణపవరం గ్రామ శివారులో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయాన్ని శుభ్రం చేయడానికి వెళ్లిన వెంకటయ్య అనే వ్యక్తికి మూడు తుపాకులు కనబడ్డాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకొని, కేసు విచారణ చేపట్టారు. గణపవరానికి చెందిన తోటకూర శేఖర్పై అనుమానం వచ్చి, అతడి కోసం గాలించారు. ఆదివారం అంగడిపేటలో అదుపులోకి తీసుకున్నారు. శేఖర్ గతంలో అక్రమంగా తుపాకులు కలిగి ఉన్న కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు.
మిర్యాలగూడ జైలులో ఉన్న సమయంలో మహబూబ్బాద్ జిల్లా తొర్రూర్కు చెందిన గుంటుక రమేష్తో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక సులువుగా డబ్బు సంపాదించేందుకు మహబూబాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మినారాయణ, శ్రీనివాస్లతో కలసి సూడో నక్సల్స్గా మారారు. విశాఖపట్నం దగ్గరలోని సాపర్ల వద్ద తుపాకులు కొనుగోలు చేశారు. ధనవంతులు, మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రోడ్డుపై వెళ్లే వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
తుపాకులను కొన్ని రోజులు శేఖర్ ఇంట్లో దాచారు. ఎవరైనా చూస్తారనే భయంతో గుడిలో ఉంచారు. తుపాకులు పెద్దవిగా ఉండడంతో పిస్టల్ లాంటివి కొనుగోలు చేయాలని అన్వేషిస్తుండగా అంగడిపేటలో శేఖర్ పోలీసులకు చిక్కాడని ఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన వారిని హైదరాబాదులో అరెస్టు చేసినట్లు తెలిపారు.






