నాగ్ చిత్రంలో ఛాన్స్ ఐశ్వర్యమే!
అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్లో మైలురాయిగా నిలిచే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. ఆయన నటిస్తున్న 100వ చిత్రం కావటంతో ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పట్నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నాగ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్నారు.
ఇందులో నాగ్ సరసన ఐశ్వర్య రాజేశ్ నటిస్తుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నా, మేకర్స్ అధికారికంగా ప్రకటించడంలేదు. అయితే, ఐశ్వర్య రాజేశ్ తాజాగా తన ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోలు.. ఈ వార్తలకు బలం చేకూర్చతున్నాయి. మనాలిలోని అందమైన లొకేషన్లలో హిమాచల్ప్రదేశ్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ, చిత్ర దర్శకుడు రా. కార్తీక్తో కలిసి దిగిన ఫోటోలను ఐశ్వర్య పోస్ట్ చేసింది.
తద్వారా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించని ఆసక్తికరమైన విషయాన్ని ఐశ్వర్య రాజేశ్ రివీల్ చేసినట్టయ్యింది. మనాలి షెడ్యూల్లో నాగ్, ఐశ్వర్య మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సహజ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్కు టాలీవుడ్ మన్మధుడి మైల్ స్టోన్ మూవీలో ఆయనకు జోడీగా నటించే అవకాశం దక్కడం కన్నా మించిన ఐశ్వర్యమేముంటుంది!






