21-01-2026 12:00:00 AM
రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు సరోజ
మణుగూరు, జనవరి 20 (విజయక్రాంతి): మండలంలోనీ గోదావరి ఇసుక ర్యాంపుల నుండి హధ్దూ, పొధ్దూ లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వ అధికారులు ఉక్కుపాదం మోపి, ఇసుక మాఫియా ఆగడాలను నియంత్రించాలని, అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కేసులు నమోదు చేయాలని రేణుక అక్షర మండలి అధ్యక్షురాలు పూనం సరోజ డిమాండ్ చేశారు.
మంగళవారం సంఘం కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తలాపనే గోదావరి ఉన్న మండల ప్రజలకు, గృహనిర్మాణాలకు, గ్రామలలో అభివృద్ధి పనులకు ఇసుక దొరకని పరిస్థితి ఉందని, కానీ కొందరు బడ కాంట్రాక్టర్లు గోదావరి తీరం నుండి టన్నుల కొద్ది ఇసుకను రాత్రి, పగలు అనే తేడా లేకుండా వందలాది లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు విచ్చలవిడిగా అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసుక మాఫియాతో సామాన్యులకు, రోడ్డు పక్కన జీవనం సాగిస్తున్న వారికి అనేక ఇబ్బందులు కలు గుతున్నాయన్నారు. గిరిజనుల సహజ సంపదను దోచేస్తున్న వారికీ బుద్ధిచెప్పి, బడా కాంట్రాక్టర్ ను తరిమికొట్టేందుకు ఆదివాసీ సంఘాలు కదిలి రావాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో ఎండి షబనా, కోరి శ్యామల, కన్నాపురం వసంత ,రెడ్డిబోయిన రేణుక, బాడిష పార్వతి, సౌజన్య డాకూరి పాల్గొన్నారు.