గోగులపూడి అటవీ ప్రాంతంలో పెద్దపులి
అప్రమతంగా ఉండాలన్న అటవీ అధికారులు
గుబ్బల మంగమ్మ తల్లి గుడికి ఆంక్షలతో అనుమతి
అశ్వారావుపేట, జూన్ 29 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతం వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లి గుడి, గోగులపూడి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నదని సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. కావిడగుండ్ల, కంట్లం, గోగులపూడి ప్రాంత ప్రజలు తమ సమీప అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుంది సమాచారంతో భయాందోళనకు గురవుతున్నారు.
సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, పశువులను గ్రామ సమీపంలోని పొలాల్లో మేతకి తొలుకువెళ్లాలని సూచించారు. వంటరిగా అడవిలోకి ఎవ్వరు వెళ్ళవద్దని హెచ్చరించారు. ప్రజలు రాత్రులు బయటకు రావద్దని సూచించారు. గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి అడవిలోకి గుంపులు గా అనుమతిస్తున్నట్టు అటవీ అధికారులు తెలిపారు. అడవిలో పులి అడుగు జాడలను గుర్తించి పెద్దపులి ఎటు సంచరిస్తుందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.






