calender_icon.png 29 June, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత ప్రాజెక్టులకు కొత్తరూపు

29-06-2025 02:31:22 AM

  1. నీటి భద్రతే ప్రజాప్రభుత్వ ధ్యేయం-
  2. జూరాలలో ప్రత్యామ్నాయ రోడ్డు
  3. వాహనాల వంతెన కోసం రూ.100 కోట్లు 
  4. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

గద్వాల, జూన్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రతి నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో వినియోగించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి శనివారం జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, ర్యాలంపాడు రిజర్వాయర్‌లను సందర్శించి, జూరాల ప్రాజెక్టు వద్ద నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ  జూరాల ప్రాజెక్ట్ సాంకేతికంగా పూర్తి భద్రంగా కొనసాగుతోందని తెలిపారు. 62 గేట్లలో 58 గేట్లు నిర్విరామంగా పనిచేస్తున్నాయని, తాత్కాలికంగా నాలుగు గేట్లకు రోప్ సమస్య తలెత్తినప్పటికీ, దాని వల్ల ప్రాజెక్ట్‌కు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. గతంలో ఎన్నో భారీ వరదలను జూరాల డ్యామ్ విజయవంతంగా ఎదుర్కొందని, ఇప్పుడు కూడా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం జాగ్రత్తలు పాటిస్తోందని తెలిపారు.

బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తమ ప్రభు త్వం గత తప్పిదాలను సరిచేసే దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఇరిగేషన్‌లో ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జూరాల డ్యామ్‌పై నుంచి భారీ వాహనాలు వెళ్లడాన్ని పూర్వంలోనే నిషేధించేలా సాంకేతిక నివేదికలు ఇచ్చినప్పటికీ, గత ప్రభుత్వ పాలనలో వాటిని పట్టించుకోలేదన్నారు.

కానీ ఇప్పుడు సమస్య తీవ్రతను గుర్తించి, జూరాల ఆవరణలో ప్రత్యామ్నాయ రోడ్డు, వాహనాల వంతెన కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా, జూరాల, మంజీర, నాగార్జున సాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రొటీన్ మెయింటెనెన్స్ చేపట్టి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తామని మంత్రి వివరించారు. జూరాల ప్రాజెక్టును పూర్తిగా రీస్టోర్ చేసి, దాని సామర్థ్యాన్ని పెంచే దిశగా డిసిల్టేషన్, సెడిమెంటేషన్ తొలగింపు పనులు చేపడుతున్నామన్నారు.

జూరాలకు అదనంగా గ్యాంట్రీ కోసం రూ.300 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ర్యాలంపాడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4 టీఎంసీల వరకు పెంచేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం రెండు టీఎంసీల వరకు మాత్రమే నీరు నిల్వ అవుతుందని మిగతా రెండు టీఎంసీల సామర్థ్యం అమలయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తుమ్మెళ్ల ఎత్తిపోతల పథకం కింద మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు భూసేకరణ పనులను వేగవంతం చేయడమే కాకుండా, జూరాల ఎడమ కాలువ ద్వారా ర్యాలంపాడు రిజర్వాయర్ పనులను త్వరితంగా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

నెట్టెంపాడు భూసేకరణ కోసం ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని, మిగతా మొత్తం త్వరలోనే ఇస్తామన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టుకు రూ.2,051 కోట్లు మంజూరు చేసి పనులను వేగంగా జరిపిస్తున్నామని, 2025, డిసెంబర్ నాటకి వందశాతం పూర్తి చేస్తామన్నారు.

పాత ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం, కొత్త ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రాన్ని నీటిలో సమృద్ధిగా ఉంచడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా జూరాల తట్టుకొని నిలబడింది: మంత్రి వాకిటి

ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడిన విశ్వసనీయ ప్రా జెక్టు జూరాల అని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకి టి శ్రీహరి కితాబిచ్చారు. 2009లో వచ్చిన భారీ వరదల సమయంలోనూ రోజుకు 12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినప్పటికీ, ప్రాజెక్టు చెక్కుచెదరలేదన్నారు. ప్రజల్లో ఆందోళన కలిగించేందుకే కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.