13-12-2025 09:03:13 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో ఇటీవల జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన రాజకీయ ఘట్టం చోటుచేసుకుంది. ఒకే ఇంటి నుంచి తల్లీ–కొడుకు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి, ఇద్దరూ వార్డు సభ్యులుగా విజయం సాధించడం గ్రామవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుంకరి భద్రమ్మ కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందిన అభ్యర్థిపై 44 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, ఆమె కుమారుడు సుంకరి లింగయ్య 31 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
తల్లీ–కొడుకులు ఇద్దరూ ఒకేసారి ఎన్నికల్లో గెలవడం లక్ష్మాపురం గ్రామ చరిత్రలోనే అరుదైన సంఘటనగా గ్రామస్తులు పేర్కొంటున్నారు.వారి విజయం గ్రామంలో హాట్టాపిక్గా మారగా,ప్రజల విశ్వాసమే తమ గెలుపుకు కారణమని భద్రమ్మ, లింగయ్యలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ విజయంపై గ్రామస్తులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.