11-01-2025 12:00:00 AM
తెలుగునాట సంక్రాంతి సంబురాలంటే తొలుతగా గుర్తుకొచ్చేది పల్లెలు, పంటలు, రైతులు. అన్నదాతలు సంతోషంగా ఉంటే పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారడంతోపాటు సమాజం కూడా సస్యశామలంగా ఉం టుంది. భోగభాగ్యాలతో పంట సిరులు చేతికందితే అన్నదాతలు, వారి కుటుంబ సభ్యుల కళ్లలో కనిపించే సంతృప్తి వెలకట్టలేనిది. తెలంగాణ గడ్డపై ఏడాది కాలంలో ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు, ప్రకటించిన పథకాల అమలు తీరును పరిశీలిస్తే రైతులు ఆనందోత్సాహాలతో, సుఖ సంతోషాలతో నిజమైన సంక్రాంతి పండుగను జరుపుకుంటున్న వాతావరణం రాష్ట్రంలో కనిపిస్తోంది.
రైతు డిక్లరేషన్తో శ్రీకారం
అసెంబ్లీ ఎన్నికల ముందే 2022 మే నెలలో కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమమే లక్ష్యంగా వరంగల్ వేదికగా ‘రైతు డిక్లరేషన్’ ప్రకటించింది. క్షేత్రస్థాయిలో అన్నదా తలు పడుతున్న ఇబ్బందులను, అవసరాలను గుర్తించి ఆ అంశాలను క్రోడీకరించి... రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా, సరైన మద్దతు ధరతో ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేయడం, ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయే పంటలకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించడం, పంట లకు బీమా, వరికి బోనస్,
ధరణి స్థానం లో భూ భారతి పోర్టల్, నూతన వ్యవసాయ విధానాలతో ప్రణాళికలు రూపొం దించడం వంటి రైతు ప్రయోజనకర పథకాలను ‘రైతు డిక్లరేషన్’లో ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వ్యవసాయంపై రైతుల్లో విశ్వాసాన్ని నింపింది.అన్నదాతలను ఆదుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ ఏడాది కాలంలోనే పలు చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి 35 శాతం కేటాయి స్తూ, 72 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చింది. బ్యాంకుల్లో చేసిన రుణాలకు వడ్డీలు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బం దులు పడుతున్న రైతులను గట్టెక్కించడానికి రుణ మాఫీ, వరి పంటను ప్రోత్సహిం చేలా వరికి బోనస్, పంట పెట్టుబడికి సాయం అందించేలా రైతు భరోసా వంటి భారీ పథకాలను అమలు చేసింది.
అంతేకాకుండా గతంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో భూములపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించడానికి నూతనంగా ‘భూ భారతి’ చట్టం ప్రవేశపెట్టి రైతు ల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది ప్రభుత్వం.
చారిత్రాత్మక రుణమాఫీ
వ్యవసాయం కోసం బ్యాంకులలో రుణాలు తీసుకొని రైతులు వడ్డీలు చెల్లించలేక, కొత్త రుణాలను పొందలేక అను భవిస్తున్న బాధలు వర్ణనాతీతం. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే తలంపుతో ఆర్థిక భారమైనా ప్రభుత్వం ‘రైతు రుణ మాఫీ’కే మొదటి ప్రాధాన్యతిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినా ఇచ్చిన హామీ ప్రకారం ఒకేసారి 2 లక్షల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
మొదటి విడతలో 11,34,412 మంది రైతులకు రూ.6,034.96 కోట్లు, రెండో విడతలో 6,40,823 మంది రైతులకు రూ.6,190.01 కోట్లు, మూడో విడతలో 4,46,832 మంది రైతులకు రూ.5,644.25 కోట్లు రుణమాఫీ చేసింది. అనంతరం సాంకేతిక కారణాలతో కొంత మంది రైతులకు అందకపోతే వాటిని పరిశీలించి 3,13,897 మంది రైతులకు రూ.2,747.67 కోట్లు చెల్లించడంతో మొత్తం మీద 25,35,964 మంది రైతులకు మొత్తం రూ.20,616.89 కోట్ల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.
రుణమాఫీ అనంతరం వరి సన్నాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్టు క్వింటాల్కు రూ.500 బోనస్ కింద రైతులకు రూ.874 కోట్లు చెల్లించడంతో రికార్డు స్థాయిలో వర్షాకాలంలో సన్నాల సాగు 60 శాతానికి పెరిగింది. అంతేకాక 31 లక్షల టన్నులకుపైగా వరిధాన్యాన్ని ప్రభుత్వం సేకరించ డంతో రైతులు సాగుకు మరింత ప్రాధాన్యతిచ్చారు. సీసీఐ ద్వారా 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి పత్తి కొనుగోలు చేసింది ప్రభుత్వం.
దీనికితోడు రాష్ట్రంలోని 42 లక్షలకు పైగా రైతుల బీమా కవరేజీ కోసం ప్రభుత్వం రూ.1514 కోట్ల ప్రీమియంను చెల్లించడంతో రైతుల్లో వ్యవ సాయంపై ధీమా పెరిగింది. అకాల వర్షాలతో నష్టపోయిన 90 వేల మందికి పైగా రైతులకు తెలంగాణ ప్రభుత్వం రూ.95 కోట్లకుపైగా పంట నష్టం చెల్లించి ఆదుకుంది.
హార్టికల్చర్, ఆయిల్ పామ్ సాగు కోసం సబ్సిడీ కింద 50 వేల మందికిపైగా రైతులకు రూ.227 కోట్లను అం దించిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రూ.181 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టడంతో రైతులు స్వాగతించారు. సాగులో రైతులకు ఎలాం టి ఇబ్బందులు కలగకుండా రూ. 10,444 కోట్ల విలువ గల ఉచిత విద్యుత్ సరఫరా అందించింది ప్రభుత్వం.
సమస్యలన్నీ తీర్చే ‘భూభారతి’
ధరణి పోర్టల్ స్థానంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టం రాష్ట్ర రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. ‘భూభారతి’ని తీసుకొచ్చే ముం దు ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులతో, రైతు సంఘాలతో చర్చించి వారికి చట్టంపై అవగాహన కల్పించారు. ఆధార్కార్డు తరహా లో ప్రతి భూకమతానికి గుర్తింపు కార్డుగా ‘భూదార్’ ఏర్పాటు చేయడం, భూ సమస్యలను జిల్లాలోనే పరిష్కరించుకునేలా ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో అప్పీలు వ్యవస్థలు కల్పించడం,
భూ పరిపాలనపై ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు, భూ సమస్యలను 3 నెలల్లోనే పరిష్కరించేలా నిబం ధనలు రూపొందించడం, 33 మాడ్యుళ్ల స్థానంలో 6 మాడ్యుళ్లను ఏర్పాటు చేయడంతో ‘భూభారతి’ రైతులకు సులభంగా మారింది. అంతేకాక పోడు భూములలో వ్యవసాయం చేస్తున్న రైతులకే ఆ భూము ల హక్కుల దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తెలంగాణ రైతుల కోసం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు తెచ్చిన ప్రభుత్వం 2025 నూతన సంవత్సరం కానుకగా ప్రకటించిన ‘రైతు భరోసా’, ‘ఇందిరమ్మ ఆత్మీ య భరోసా’ పథకాలు అన్నదాతలకు వరంగా మారాయి. ‘రైతు భరోసా’ కింద త్వరలో ఏటా ఎకరాకు రూ.12 వేలు అం దించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రైతులకు అది పెట్టుబడి సాయంగా మా రింది.
అంతేకాక ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన వారికి ‘అభయ హస్తం’గా మారింది. గతంలో ‘రైతు బంధు’ పథకం కింద వ్యవసాయ యోగ్య త లేని భూములకు కూడా ప్రభుత్వం నగదు చెల్లించడంతో రూ.22 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో రైతు భరోసా కింద వ్యవసాయం చేసే భూములకే చెల్లింపులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించ డంతో నిజమైన రైతులకు న్యాయం జరగనుంది.
ఈ పథకాల్లో భాగంగా రాష్ట్రంలో సాగులో ఉన్న సుమారు 1.40 లక్షల ఎకరాల భూమికి రూ. 9 వేల కోట్లు, వ్యవసాయ కూలీలకు మరో రూ.2 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతున్నా రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవు తోం ది. రైతుల సుభిక్షమే సమాజానికి సురక్షితం అనేలా ప్రభుత్వం పలు పథకాలను ప్రకటిస్తూ అమలు చేస్తుండడంతో తెలంగాణ అన్నదాతలు పసిడి పంటలతో నిజ మైన సంక్రాంతిని జరుపుకుంటున్నారు.