calender_icon.png 22 September, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి లాభాలపై స్వేత పత్రం విడుదల చేయాలి

22-09-2025 09:22:53 PM

నిరాశ మిగిల్చిన కార్మికుల లాభాల వాట

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి

మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ సాధించిన లాభాలపై యాజమాన్యం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలు ప్రకటించకుండా ఆర్థిక సంవత్సరం ముగిసి నెలలు గడుస్తున్నప్పటికీ కార్మికులు కార్మిక సంఘాల ఆందోళన పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ముఖ్యమంత్రితో లాభాలు ప్రకటించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సం,,లో సంస్థ సాధించిన వాస్తవ లాభాలు 6394 కోట్లు కాగా అందులో 4034 కోట్లు పక్కనపెట్టి 2360 కోట్లపై 34 శాతం 802.40 కోట్లు కార్మికులకు చెల్లిస్తు న్నామని  ప్రకటించడం కార్మికులను మోసగించడమే నని ఆయన యజమాన్యం, ప్రభుత్వం పై తీవ్రంగా మండి పడ్డారు.

కాంట్రాక్ట్ కార్మికులకు గత సం,,లో 5000 చెల్లిస్తే ఈసారి 5500 చెల్లించడానికి నిర్ణయించారని, లాభాల వాటా చెల్లింపులో పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు నిరాశే మిగిల్చారని లాభాల ప్రకటన కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. వాస్తవ లాభాలు దాచిపెట్టి 6 నెలలుగా కార్మికులను కార్మిక సంఘాల ను ఆందోళన బాట పట్టించి చివరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యాన్ని కల్పించి కార్మికులను మరోసారి మోసం చేయడానికి కారణమైన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలను కార్మికులు నిలదీయాలని కోరారు.

లాభాల వాటా ప్రకటన సందర్భంగా కార్మికులు ఆశించిన విధంగా మారుపేర్ల సమస్య పరిష్కారం, సొంతింటి పథకం అమలు, రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ 42 వేల కోట్ల రూపాయలు చెల్లింపు, అలవెన్స్ లపై ఇన్కమ్ టాక్స్ కార్మికులకు తిరిగి చెల్లింపు, దసరా సెలవు అక్టోబర్ 3 న ఇవ్వడానికి అంగీకారం తదితర అంశాలపై పరిష్కారం దొరుకుతుందని ఆశించిన కార్మికుల ఆశలు  అడియాసలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజకీయ జోక్యాన్ని తగ్గించడానికి ఐక్య పోరాటాలే పరిష్కారం అన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.