18-06-2025 07:45:34 PM
మోతే: ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలుచుకొని విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం ప్రైవేట్ పాఠశాలలు మోపుతున్నాయని డివైఎఫ్ఐ మండల కార్యదర్శి వెలుగు మధు(DYFI Mandal Secretary Velugu Madhu) ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ... ప్రైవేట్ కార్పోరేట్ పాఠశాలలు అనేక కోచింగ్ సెంటర్ల పేరుతో నవోదయ గురుకులం సైనిక్ పేర్లతో ఓలంపియాడ్, ఐపీఎల్, గ్లోబల్, ఇంటర్నేషనల్ సీబీఎస్సీ గ్లోబల్స్ అనే ఆకర్షణీయమైన పేర్లతో మాయ చేస్తూ, యూకేజీ నుండి పదవ తరగతి వరకు విద్యార్థుల నుంచి పుస్తకాలు, టై, బెల్ట్లు, డ్రెస్లు, మరెన్నో పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు.
కొంతమంది యాజమానులు డొనేషన్ పేరిట నర్సరీ నుండి పదో తరగతి వరకు రూ.1,50,000 వరకు వసూలు చేస్తున్నారని, ఇది తల్లిదండ్రులపై తీవ్ర భారం పెడుతోందని తెలిపారు. విద్య హక్కు చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉచితంగా కనీసం 25% సీట్లు ఇవ్వాల్సిన నిబంధనను అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. జిల్లా విద్యా అధికారులు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై తక్షణమే స్పందించి సంబంధిత యాజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.