14-06-2025 12:30:29 AM
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న మోతె ఎస్సైపై విచారణ చేపట్టాలి
బాధితురాలు లచుమళ్ళ రమణమ్మ
సూర్యాపేట,(విజయక్రాంతి): తమ ఇంటి ఇలవేల్పు ఎల్లమ్మ పండుగ చేస్తుండగా అడ్డుకున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాలోని మోతే మండల కేంద్రానికి చెందిన బాధితురాలు లచ్చమల్ల రమణమ్మ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు తెలిపారు. ఆమె తెలిపిన వివరాలు ప్రకారం తమ చిన్న కూతురు వివాహము జూన్ 6వ తారీఖున నిశ్చయం కాగా తన సొంత గ్రామమైన మోతే మండల కేంద్రంలో ఈనెల 3న ఎల్లమ్మ దేవత పండగ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అయితే క్రైస్తవ మతానికి చెందిన తన బావ, మరుదులు అయిన లచ్చుమల్ల వెంకటయ్య, లచ్చు మల్ల శ్రీనివాస్ (కానిస్టేబుల్), లచ్చు మల్ల స్వప్న (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు) యశోద, లచ్చు మల్ల రాజు కలిసి ఎల్లమ్మ గుడికి వెళ్లకుండా కంచె వేసి అడ్డుపడ్డారన్నారు.
అంతేకాకుండా వంద నెంబర్ కు కాల్ చేశారన్నారు. దీంతో పోలీసులు అక్కడికి రాగా తాము ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నామని ఎస్సై కి చెప్పిన వినకుండా తమ పైనే కేసు పెట్టారన్నారు. తాము పండుగ కోసం డప్పులు కొట్టే వారిని, ఇతర పనులవారిని పిలిపించగా తమ బావ, మరుదులు'పోలీసుల ద్వారా పండగకు సహకరించిన అందరిపై కేసులు పెట్టిస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లేలా చేశారన్నారు. అలాగే పండుగ జరుగుతుండగా కరెంటు లైట్లు బందు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివాహా నిశ్చితార్థము కావడంతో తన కూతురు, అల్లుడు, కూతురు కలిసి ఎల్లమ్మ దేవతను మొక్కుతుండగా అసభ్య పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యం చేసి, భౌతికంగా అడ్డుకొని నెట్టివేస్తూ చంపుతామని భయభ్రాంతులకు గురిచేశారన్నారు.
లచ్చుమల్ల రాజు ఫోన్లో చంపుతామని బెదిరించిన ఆడియో సాక్ష్యం కూడా తమ వద్ద ఉందన్నారు. వారు మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నా మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి ఎలాంటి విచారణ చేయకుండానే ఏకపక్షంగా వ్యవహరించాడని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు తగు విచారణ చేసి మోతె ఎస్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, పోలీసు ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని బెదిరిస్తున్న తన బావ, మరుదులపైనా చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని కోరారు.