19-01-2026 12:26:51 AM
ప్రారంభమైన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర స్థాయి 11వ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం నిర్వహించిన పోటీల ప్రారంభోత్సవానికి కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డీ బోజా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున క్రీడాకారులు తరలివచ్చారు. ముందుగా ముఖ్య అతిథులు క్రీడా జెండాను ఆవిష్కరించి, క్రీడా స్ఫూర్తికి చిహ్నమైన క్రీడాజ్యోతిని వెలిగించి, పోటీలను అధికారికంగా ప్రారంభించారు. అథ్లెటిక్స్ ఓరాల్ చాంపియన్షిప్గా ములుగు జిల్లా జట్టు నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ... జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవలేదని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే జాతీయ స్థాయి లో రాణిస్తారని అన్నారు.
విద్యార్థులు ఓటమికి కుంగిపోకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ... 33 జిల్లాల నుండి తరలివచ్చిన విద్యార్థులకు ఆదిలాబాద్ వేదిక కావడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పోటీ పడాలని సూచించారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. విద్యార్థులలో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహెర్ బిన్ హందన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూలు నర్స య్య, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, శ్రీకాంత్ రెడ్డి, డివైఎస్ఓ శ్రీనివాస్, వివిధ జిల్లాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, క్రీడా సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.