25-06-2025 12:54:21 AM
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): బడిబాటలో ఈసారి అడ్మిషన్లు పెరిగాయి. గతేడాది కంటే ఈ విద్యాసంవత్సరం సర్కారు బడుల్లో అన్ని తరగతులు కలిపి 55,255 అడ్మిషన్లు పెరిగాయి. గతేడాది జూన్ 24 వరకు 1-10 తరగతులు కలిపి 2,00,901 అడ్మిషన్లు నమోదైతే, ఈ ఏడాది జూన్ 24 వరకు 2,56,156 అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ విద్యాసంవత్సరంలో ఈనెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
అయితే ఈనెల 24వ తేదీ వరకు ఒకటో తరగతిలో 1,07,126 అడ్మిషన్లు నమోదయ్యాయి. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చేరిన వారు 48,133 మంది ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ల నుంచి చేరిన వారు 1,00,897 మంది ఉన్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 2,56,156 అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈసారి బడిబాట సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయని అధికారులు చెబుతున్నారు.