కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి
అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బాధ్యులతో ఐడీఓసీలో సమావేశం
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులను కల్పించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. యాసంగి సీజన్ సందర్భంగా జిల్లా లోని 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆద్వర్యంలో 93 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, సంఘాల కార్యదర్శులు, సెంటర్ల ఇంచార్జిలు, ట్యాబ్ ఆపరేటర్లతో కొనుగోలుపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం అదనపు కలెక్టర్ శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్నీ రకాల మౌళిక సదుపాయాలను కల్పించాలని, కొనుగోలు కు సంబంధించిన పరికరాలను సమకూర్చుకోవాలని, నిబంధనల ప్రకారం దాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ఈ నెల మొదటి వారంలో కేంద్రాలు ప్రారంభించాలని, అవసరమైన గన్ని బ్యాగ్స్ సమకూర్చాలని, కేటాయించిన రైస్ మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు.శిక్షణలో జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




