14-11-2025 07:54:54 PM
ఎమ్మెల్యే జీఎస్సార్
రేగొండ/గణపురం,(విజయక్రాంతి): సహకార వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఈ మేరకు ఎమ్మెల్యే శుక్రవారం 72 వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా రేగొండ, గణపురం మండలాల్లోని ప్రాథమిక సహకార కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... సహకార వ్యవస్థ అనేది అభివృద్ధికి ఆధ్యాం అని,సహకార వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తోందనీ అన్నారు. రైతు, కార్మికుడు, చిన్న వ్యాపారవేత్త ల అభివృద్ధిలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ప్రభుత్వం సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి పలు కార్యక్రమాలు చేపట్టింది. ప్రతి గ్రామంలో సహకార భావన పెంపొందితే ఆ గ్రామం ఆర్థికంగా ఎంతో బలపడుతుంది. సభ్యుల భాగస్వామ్యంతో నడిచే సహకార సంఘాలు పారదర్శకంగా, నమ్మకంగా పనిచేస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.పాలు, వ్యవసాయం, మార్కెటింగ్, రంగ స్థాయి రుణాల విషయంలో సహకార సంస్థల సేవలు అమూల్యం. యువత ఈ రంగంలో ముందుకు రావాలి.ఆధునిక సాంకేతికతను అవలంబిస్తూ సంఘాలు తమ సేవలను విస్తరించాలని చెప్పారు.సహకార వారోత్సవాలు మనకు సహకారం,ఐకమత్యం, సామాజిక బాధ్యతలను గుర్తు చేసే వేడుకలని అన్నారు.అనంతరం చెల్పూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, సహకార సంఘాల ప్రతినిధులు, ఆయా మండలాల రైతులు,తదితరులు పాల్గొన్నారు.