28-10-2025 01:02:36 AM
భారీ పోలీసు బందోబస్తు
మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 27 : మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో లాటరీ పద్దతిలో వైన్ షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది. నూతన ఎక్సయిజ్ పాలసీ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు.
ఎక్సైజ్ మహబూబ్ నగర్,నారాయణ పేట జిల్లాలకు. 90 మద్యం షాపులకు గాను మొత్తం 2487 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇందులో ఎస్. టి.లకు 3,ఎస్.సి.లకు 10,గౌడ లకు 14 మద్యం షాప్ లు రిజర్వేషన్ కేటాయించారు.ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు.
లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్ లను అందరికీ చూపిస్తూ, పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం నుండి చివరి వరకు ఫొటో, వీడియో చిత్రీకరణ జరిపించారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారినే లోనికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కల్లెక్టర్ కార్యాలయం తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన పోలీసు,ఎక్సైజ్ టాస్క్ పోర్స్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎస్.పి.డి జానకి బందోబస్తు పర్యవేక్షించారు.. లక్కీ డ్రాలో అదృష్టం వరించి వైన్ షాపులు కేటాయించబడిన వారు నిబంధనలను అనుసరిస్తూ, లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన ఏర్పాట్లు కల్పించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధాకర్, ఏ. ఈ.ఎస్ నర్సింహ రెడ్డి, మహబూబ్ నగర్ ఎక్సైజ్ సిఐ వీరా రెడ్డి, జడ్చర్ల సిఐ విప్లవ రెడ్డి, కోస్గి సి ఐ బాలకృష్ణ, నారాయణ పేట అనంతయ్య,టాస్క్ ఫోర్స్ సిఐ కవిత,సిఐ లు,ఎస్. ఐ.లుఇతర అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రశాంతంగా కొనసాగింది.