సింగరేణి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
ఇల్లందు,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలో డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జెకె కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఏరియా జీఎం వి.కృష్ణయ్య, ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ చిన్ననాటి నుంచే అంటరానితనాన్ని ఎదుర్కొంటూ దళితుల హక్కుల కోసం, కుల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని తెలిపారు.
రాజ్యాంగ శిల్పిగా, స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా, ఆర్థికవేత్తగా దేశానికి అపార సేవలు అందించారని పేర్కొన్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య సాధించి అరుదైన గౌరవం పొందిన ఆయన న్యాయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేశారని వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్యరూపకాలు, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
అదేవిధంగా జెకె ఓసి, కేవైసి, వర్క్ షాప్, హాస్పిటల్, ఎస్ఎన్టిసి విభాగాల్లో కూడా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం రామస్వామి, జెకె పిఓ జాకీర్ హుస్సేన్, కేఓసిపిఓ గోవిందరావు, డీజీఎం పర్సనల్ అజ్మీర తుకారాం, డీజీఎం (సివిల్) రవికుమార్, డీజీఎం ఏరియా వర్క్ షాప్ నాగరాజు నాయక్, మేనేజర్ శ్రీనివాస్, అధికారుల సంఘం అధ్యక్షుడు శివ ప్రసాద్, భద్రత ప్రతినిధి నజీర్ అహ్మద్, సంఘాల నాయకులు మెహబూబ్, యు.బ్రహ్మం, కే శ్రీనివాస్, యాదగిరి, బి.ప్రభాకర్, బి.రామారావు తదితర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.




