calender_icon.png 7 June, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీలేని పోరాటమే

07-06-2025 01:24:59 AM

  1. ‘బనకచర’్లకు అంగీకరించం
  2. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం 
  3. దీనిపై కేంద్రానికి లేఖ రాశాం
  4. బీఆర్‌ఎస్ నేతలు అప్పుడు మోసం చేసి.. ఇప్పుడు డ్రామాలు: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 6(విజయక్రాంతి): తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని, బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో.. అంతర్‌రాష్ట్ర జల విధానాలకు, జీఆర్‌ఎంబీ, సీడ బ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్టు ఉందని ఆక్షేపించారు.

ఈ ప్రాజెక్టును తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్టు విషయాన్ని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తోపాటు జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు వేర్వేరుగా లేఖల ద్వారా వివరించామని గుర్తు చేశారు. అయితే తమకు ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, ఒకవేళ వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామం టూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గత నెలలో లేఖ ద్వారా స్పష్టం చేశారని తెలిపారు.

ఈ అంశంపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తమకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రాజెక్టు విషయంలో ఏపీ ఉల్లంఘనలను పూర్తిగా సదరు లేఖల్లో సమగ్రంగా వివరించామని చెప్పారు. కేంద్రం చట్టవిరుద్ధంగా ఏపీకి సహకరిస్తుందని తాము అనుకోవడం లేదన్నారు.

తెలంగాణకు అన్యాయం జరిగితే తాము ఎంతవరకైనా పోరాడతామని హెచ్చరించారు. హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని, ఈ అంశంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఈ అంశంలో కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ జోక్యం చేసుకుని కేంద్రాన్ని  ఒప్పించాలని డిమాండ్ చేశారు. 

అన్యాయం చేసింది బీఆర్‌ఎస్సే..

కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతుంటే గత పదేళ్లుగా బీఆర్‌ఎస్ సహకరించిందని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాటా 724 టీఎంసీలు ఏపీకి వెళ్తే.. విభజన అనంతరం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 1,254 టీఎంసీల కృష్ణాజలాలు ఏపీకి తరలించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వృథా ఖర్చు చేయకుంటే కృష్ణా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని అభిప్రాయపడ్డారు.

తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడం ద్వారా రూ.68వేల కోట్లు కాళేశ్వరం నిర్మాణానికి అదనపు ఖర్చు అయ్యిందన్నారు. కృష్ణా జలాల అంశంలో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్‌ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. 512 టీఎంసీ ఏపీకి, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించాలంటూ సంతకం పెట్టింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అని ఆ పార్టీ నేతలను నిలదీశారు.

బీఆర్‌ఎస్ నేతలు అప్పుడు మోసం చేసి, ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు పనులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు తెలంగాణకు మరణశాసనమని పేర్కొన్నారు. ప్రతిరోజూ 3 టీఎంసీలు నీటిని తరలించేందుకు కేసీఆర్ సర్కార్ సహకరించింది నిజం కాదా అని ప్రశ్నించారు.

జగన్‌తో అలాయ్ బలాయ్ చేసుకుని కృష్ణా నీటి దోపిడీకి కేసీఆర్ సహకరించారని విమర్శించారు. పదేళ్లు కేసీఆర్, హరీశ్‌రావు ఏపీ కోసమే పనిచేసి, కృష్ణా నీటిని తరలించారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు పూర్తయ్యేవరకు తెలంగాణ కావాలనే అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లలేదని తెలిపారు.

జగన్ రహస్య ఒప్పందంలో భాగంగానే తెలంగాణ అపెక్స్ మీటింగ్‌కు వెళ్లలేదన్నారు. బనకచర్లపై బీఆర్‌ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, బీఆర్‌ఎస్ నేతలు గోబెల్స్ రావు అని పేరు మార్చుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు.