calender_icon.png 26 June, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిడ్నాప్ కేసు పెట్టిందనే హత్య

26-06-2025 12:00:00 AM

  1. తల్లిని హత్య చేద్దామని ప్రియుడికి చెప్పిన తేజశ్రీ

నిరాకరించడంతో సూసైడ్ చేసుకుంటానని బెదిరింపు

అంగీకరించిన ప్రియుడు శివ 

జీడిమెట్ల హత్య కేసులో సంచలన విషయాలు

మహబూబాబాద్, జూన్ 25 (విజయక్రాంతి)/కుత్బుల్లాపూర్: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి ఎల్‌బీనగర్‌లో జరిగిన సాంస్కృతిక సారథి కళాకారిణి అంజలి(39) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎన్‌బీనగర్‌లో అంజలి తన ఇద్దరి కుమార్తెలతో కలిసి నివాసముంటున్నది.

తన పెద్ద కూతురు తేజశ్రీ(16) 7వ తరగతిలో ఉన్న సమయంలో తల్లితో ఉండనని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంజలి తనను కొట్టేదని, ప్రేమగా చూసేది కాదని, రెండవ భర్త కూతురిపైనే ఎక్కువ ప్రేమ చూపించేదని తేజశ్రీ చెప్పినట్టు డీసీపీ వెల్లడించారు. ఇటీవల తేజశ్రీ తన ప్రియుడు శివ(19)తో వెళ్లిపోవడంతో ఈ నెల 19న జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో అంజలి మిస్సింగ్, కిడ్నాప్ కేసు పెట్టింది.

శివ, తేజశ్రీల ప్రేమను ముందు ఒప్పుకొని, తర్వాత అడ్డు చెప్పడంతో ఆగ్రహానికి గురైన తేజశ్రీ హత్యకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. అంజలిని హత్య చేద్దామని తన ప్రియుడు శివకు చెప్పగా నిరాకరించడంతో, తన మాట వినకపోతే ఆత్మహత్య చేసుకొని నీ పేరు రాస్తానని శివను బెదిరించడంతో ఒప్పుకున్నాడు.

పథకం ప్రకారం హత్య చేసే సమయంలో అంజలి చిన్న కూతురు ఇంట్లోనే ఉండటంతో బయటకు పంపించి, శివ, అతని సోదరుడు యశ్వంత్ (18) అంజలికి ఊపిరాడకుండా చున్నీని మెడకు బిగించి, సుత్తితో కొట్టాడు.

కొద్దిసేపటి తర్వాత అంజలి చిన్న కూతురు ఇంట్లోకి వచ్చి వంటగదిలో అంజలి కింద పడి ఉండటంతో 108 ఫోన్ చేయాలని కోరినా కూడా తేజశ్రీ కాలయాపన చేసిందని తెలిపారు. నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి, శివను చర్లపల్లి జైలుకి, తేజశ్రీ, యశ్వంత్‌లను జువైనల్ హోమ్ తరలించామని డీసీపీ సురేష్ కుమారు తెలిపారు. 

ఇనుగుర్తిలో అంజలి అంత్యక్రియలు

ఎల్‌బీనగర్‌లో కూతురు చేతిలో హత్యకు గురైన అంజలి అంత్యక్రియలు ఆమె పుట్టినిల్లు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కేంద్రంలో బుధవారం జరిగాయి. ఇనుగుర్తికి చెందిన అంజలి తెలంగాణ ఉద్యమంలో కళాకారిణిగా రాష్ట్రవ్యాప్తంగా పేరు గడిచింది.

నెల రోజుల క్రితం వరకు మహబూబాబాద్ జిల్లాలోనే విధులు నిర్వహి స్తుండగా ఇటీవలే మేడ్చల్ మల్కాజిగిరి కి బదిలీపై వెల్లింది. మంగళవారం రాత్రి అంజలి మృతదేహాన్ని పుట్టింటికి తీసుకువచ్చి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. చిన్న కూతురు మనస్విని తల్లి చితికి నిప్పు పెట్టి తన కర్తవ్యాన్ని నెరవేర్చింది.