సాహితి ఇన్ఫ్రాపై మరో కేసు
రూ.1.50 కోట్ల మోసంపై తాజాగా ఓ వ్యక్తి ఫిర్యాదు
తవ్వినకొద్దీ వెలుగులోకి సాహితి అక్రమాలు
చైర్మన్ బూదాటి లక్ష్మీనారాయణపై మరో కేసు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (విజయక్రాంతి): సాహితి ఇన్ఫ్రా ఫ్రీ లాంచ్ బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఫ్రీ లాంచ్ ముసుగులో సాహితి ఇన్ఫ్రా మోసంపై పోలీస్ స్టేషన్లలో, కోర్టులలో కేసులు నడుస్తుండగా తాజాగా మరో వ్యక్తి సాహితి ఇన్ఫ్రా సంస్థ తనను రూ. 1.50 కోట్లు మోసం చేసిందని గురువారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు రాకేష్ విడతల వారీగా సాహితి సంస్థ ప్రతినిధి సందు పూర్ణచందర్రావుకు నగదు రూపంలో రూ. 1.50కోట్లు చెల్లించాడు.
ఈ క్రమంలోనే నానక్ రాంగూడలోని సాహితి ఇన్ఫ్రా ఫ్రీలాంచ్ వ్యవహారంపై సాహితి ఇన్ఫ్రా చైర్మన్ బూదాటి లక్ష్మీనారాయణపై మరో కేసు నమోదైంది. రాకేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీనారాయణతో పాటు సందు పూర్ణచందర్రావు, వరద బేబి స్వాతి, వరద రామారావులపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీనారాయణతో కలిసి త నతో పాటు తన తండ్రిని మోసగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో లక్ష్మీనారాయణపై సెక్షన్ 406, 420 డిపాజిటర్స్ యాక్ట్ కిం ద పోలీసులు కేసు నమోదు చేశారు.






