02-09-2024 12:00:00 AM
హేమండార్ఫ్ :
ఫణి కుమార్ :
పాఠకులను ఆకట్టుకొనే కట్టుకథలకన్నా వాస్తవాల్ని ప్రతిబింబించే నిజ జీవిత గాథలకు ఎంతో విలువ ఉంటుంది. నిజానికి ఇలాంటి వాటికే పాఠకాదరణ ఎక్కువగా ఉంటుంది, ఉండాలి కూడా. ఆత్మకథలు, జీవితచరిత్రలకు ప్రాధాన్యం లభించేది ఇందుకే. రెండు దశాబ్దాల క్రితం ఫణికుమార్ రాసిన ఈ తరహా యధార్థ కథల్లో మన ఆదిలాబాద్ తదితర ప్రాంతాలలోని ఆదివాసుల జీవిత చిత్రణ ఎంతో గొప్పగా జరిగింది. అప్పట్లోనే ప్రసిద్ధ పత్రికలో ప్రచురితమైన వీటిని రచయిత పుస్తకరూపంలోకి తెచ్చారు. అవే ‘గోదావరి గాథలు’ పేరున వెలుగుచూశాయి. ఆ సంకలనంలోని ‘రాజాసాబ్’ కథను ఈతరం పాఠకుల కోసం ‘విజయక్రాంతి మీ ముందుకు తెస్తున్నందుకు సంతోషంగా ఉంది. సంపాదకులు
గోండుల యింటి పేర్లు దాదాపు గోత్రాల లాంటివి. ఆ యింటి పే రుగల వారందరికీ ఋషులెవ రో పూర్వీకులు వుండేవారనీ, స గోత్రికుల మధ్య వివాహాలు నిషిద్ధమనీ సంప్రదాయం. ఇద్దరు గోండులు కలసి ‘రామ్ రామ్’ చెప్పుకున్న వెంటనే బత్తాపాడి? (ఏ యింటి పేరు/ గోత్రం వాడి వి) అని అడుగుతారు. కుమరం, మేస్రాం, మడావి, సీడం, అత్రాం యిలా వుంటాయి ఆ యింటి పేర్లు.
అత్రాం పాడి వారిది రాజకుటుంబం. ఉట్నూరు కేంద్రంగా ఆ ప్రాంతాన్ని పాలించిన ప్రభువులు వారు. ఉట్నూరు కోట నామమాత్రా విశిష్టంగానే వున్నా, రాజ్యాలు పోయి నా, ఆ రాజకుటుంబీకులకు అప్పుడప్పు డూ తినడానికి జొన్నలుకూడా దొరక్క పోయినా గోండు జనసామాన్యం రాజకుటుంబీకుల పట్ల అపారమైన గౌరవం చూపుతుం ది. రాజులలో దైవాంశ వుంటుందని భావిస్తుంది. ఈ కుటుంబాల వారిని కలిసినపుడు రాజులయెడ పాటించవలసిన మర్యాదలన్నీ పాటిస్తుంది. ఈ కుటుంబానికి చెందిన యిప్పటి ‘రాజు’ రాజా అత్రాం దేవ్షా. ఈయన ఉట్నూరులో వుంటున్నారు.
ఈ కుటుంబానికి చెందిన యింకొక శాఖ ఉట్నూరు దగ్గరలో కంచనపల్లి గ్రామంలో వుంది. రాజా అత్రాం భగవంతరావు ఈ శాఖకు ప్రస్తుత ప్రతినిధి. దాదాపు అరవై ఐదు, -డ్బ్బు ఏళ్ల వయస్సుంటుంది. తన అవసరానికి సరిపడా మాత్రమే జొన్నలు పండిస్తాడు. కరువు సంవత్సరాలలో అదీ లేదు. అయితే ఆయన్ని చూస్తే ఏ లోటు అనుభవిస్తున్నట్లనిపించదు. తీరిక వున్నప్పుడు రకరకాల కొయ్యబొమ్మలు అందంగా చెక్కడం ఆయన కిష్టమైన పని. కుర్చీలు, బల్లలు కూడా చాల అందంగా చేస్తాడని వెళ్లిన కొత్తలో విన్నాను. బల్లల్లో కూడా ప్రతి అంగుళంలో దేవతా మూర్తులనో, అప్సరసలనో, పూలు, లతలనో చెక్కి ఇవి ఏ ప్రాచీన కాలానికి చెందినవో అని భ్రమ పడేలా చేయగలడట.
మరి ఉట్నూరులో ఉండగానే యీయనతో కొన్ని కు ర్చీలు బల్లలు చేయించుకుంటే హైదరాబాదులో మన వాళ్లు చూస్తే ముగ్ధులవరూ? అలా అని ఏమీ యివ్వకుం డా వెట్టి చాకిరీ చేయించుకోవాలని కాదు. ఆయన శ్రమ వుంచుకోకుండా ఈ వస్తువుకింత అని ఏర్పాటు చేసుకుని యిచ్చేస్తే ఋణమూ వుండదు, - మన కార్యమూ అవుతుంది.
నా పని అయిన తర్వాత యితర జిల్లా అధికారులకు కూడా చెబితే సరి. వాళ్లకి కావలసిన వస్తువులు వాళ్లు చే యించుకుంటారు. భగవంతరావుకి అం తోయింతో ముట్టచెబుతారు. ఆదిలాబా దు గుర్తుంచుకోవడానికి జ్ఞాపికలుగా కళాఖండాలు సంపాదించినట్టవుతుంది. భగ వంతరావుకి ధనరూపేణా కొంత సాయం చేసినట్టూ అవుతుంది. ఈ వూహ యిన్నేళ్లుగా ఎవరికీ రాలేదా? బహుశా భగవంతరావు గారిని ఎవరూ ఎరక్క పోవడమే కారణమై ఉంటుంది.
కోర్టు పని లేని ఒక శుభదినాన భగవంతరావుగారికి కబురు పెట్టాను. మధ్యాహ్నానికి ఆయన వచ్చారు. కుశలమడిగిన తర్వాత నా ఆలోచన చెప్పాను. నిజం దాచుకోకుండా నా స్వార్థం కొంతవున్న మాట నిజమేననీ, నా స్వార్థంతోపాటు ఆ యనకు సాయం చేయాలనే యిచ్ఛా లేకపోలేదనీ చెప్పా ను. గోండులకు స్వతస్సిద్ధమైన ఓపికతో నేను చెప్పినదంతా విన్నాడు. అయితే, నేను వూహించినట్టు ఆనం దంతో ఎగిరి గంతెయ్యలేదు.
“అయ్యా! నా యందు మీకుగల దయతోనే యీ ఆ లోచన చేశారు. కానీ, యీ పని నా వృత్తికాదు. ఉబుసుపోకకు చేసేపని. అందులో కొంత కళ వుంటే వుండొచ్చు- అది నేను నేర్చుకోవడం ద్వారా వచ్చింది కాదు. యీ పనినుంచి ప్రతిఫలాన్ని ఆశించలేదెన్నడూ” అన్నాడు.
“మీ ఆర్థిక పరిస్థితి ఆలోచించండి. ఒకప్పుడు మీరు రాజ్యాలేలిన మాట నిజమే. కాని, యిప్పుడు ఒక్కోసారి భోజనానికి కూడా యిబ్బందవుతోందని విన్నాను. చేతిలో విద్య వున్నప్పుడు దానిద్వారా కొన్ని లౌకిక ప్రయోజనాలు కలగకపోతే అది వుండి మాత్రం ఏం సుఖం?” అన్నాను.
“లౌకిక ప్రయోజనాలకు వుపయోగించకూడదని నే ను సిద్ధాంతీకరించడం లేదు. అది తప్పని కూడా అనను. నేను చేయలేనని మాత్రమే మనవి చేస్తున్నాను” అన్నా డు భగవంతరావు.
“నిజమే కాని, అనే ముందు యింకో కోణం నుంచి ఆలోచించండి. కనీసం జిల్లాలోని ముఖ్యులందరికీ ఏదో ఒక వస్తువు అందంగా చేసిస్తే వారితో పరిచయమవుతుంది కదాఁ మీకు ఏదైనా పనిబడితే ఆ పరిచయం వుపయోగపడుతుంది” అన్నాను.
“నేను చిన్నవాణ్ణి. మారుమూల గ్రామాలలో వుండే నాకు ఏ పెద్ద అధికారితోనూ, నాయకులతోనూ పనిబడ దు. పోనీ, ప్రతిఫల నిరపేక్షంగా బహుమతి యిద్దామంటే అన్ని వస్తువులు చేసే ఓపికా నాకు లేదు. ఏది ఏమైనా, మీరు నా విషయంలో యింత శ్రమ తీసుకున్నారు గనుక ఒక అందమైన వస్తువు మీకు చేసిస్తాను మీరు వెళ్లేలోపు. ఆదివాసుల మధ్య మీ జీవితానికి జ్ఞాపికగా వుంచుకుందురుగానీ” అన్నాడు (నాకు భగవంతరావు గారికీ జరిగిన సంభాషణంతా ఉర్దూలో జరిగింది). తర్వాత పేలవమైన సంభాషణ జరిగింది మా యిద్దరి మధ్య. నా సలహా వినలేదన్న భావం బలంగా వుంది నాలో. తనకు అప్రియమైన విషయం చెప్పానన్న భావన బహుశా భగవంతరావు గారిలోనూ వుండే వుంటుంది.
ఆయనతో నాకదే పరిచయం. నేను ఆదిలో కొంత ని ష్ఠూరపడ్డా, ప్రథమ పరిచయంలోనే చాల గౌరవం కూ డా కలిగింది ఆ విశిష్ట వ్యక్తిత్వం మీద అయితే చాదస్తం మంచిదికాదనీ అనిపించింది. మారుతున్న కాలంతోపాటు మనుషులు కూడా మారాలి. అలా మారకపోతే ఆధునిక ప్రపంచంలో యిమడలేక గత వైభవ చిహ్నాలుగా మాత్రమే మిగిలిపోతారు. తర్వాత నేను చాలాకాలం భగవతరావు గారిని కలవలేదు. కలిసే అవకాశం గానీ రాలేదు. మా పరిచయాన్ని కాలగతిలో దాదాపు మరచేపోయాను.
*** *** ***
కొన్ని నెలల తర్వాత లండన్ నుండి ప్రొఫెసర్ హేమండార్ఫ్, వారి సతీమణితో ఆదిలాబాదు వస్తున్నారని కబురొచ్చింది. నేనైతే గాంధీగారినో, నెహ్రూగారినో కలవబోతున్నంత సంతోషపడ్డాను. అంతవరకూ ప్రొఫెసర్ హేమండార్ఫ్ రచనలు చదవడమూ, ఆయన గురించి వినడమే తప్ప కలిసే భాగ్యం కలగలేదు. హేమండార్ఫ్ గారు యీ ప్రాంతాలకు రావడం కూడా మన చరిత్రలో భాగమే.
1940లో కొమరం భీము అనే గోండు విప్లవకారుడు నిజాం నిరంకుశత్వంపై, దోపిడీ విధానాలపై తిరగబడ్డాడు. ఈ పోరాటంలో కొమరం భీముని కాల్చి చంపినా గోండు సమాజంలో చెలరేగిన అలజడిని అణచలేక పోయారు. ఈ అశాంతి కారణాలను విశ్లేషించి ఉపశమనానికి సూచనల నివ్వవలసిందిగా నిజాం ప్రభుత్వం లండన్ యూనివర్సిటీ మానవశాస్త్ర (ఆంత్రోపాలజీ) విభాగాధ్యక్షులైన ప్రొఫెసర్ క్రిష్టఫ్ ఫాన్ ఫ్యూరర్- - హేమండార్ఫ్ (క్లుప్తంగా హేమండార్ఫ్) గారిని కోరింది. పరిశీలన కోసం వచ్చిన మనిషి గోండుల దైన్యాన్ని చూసి మనసు కరగి ఆ సమస్యల పరిష్కారాన్ని అన్వేషిస్తూ మార్లవాయి గ్రామంలో ఏళ్ళ తరబడి వుండిపోయారు. ఆయన పుణ్యమా అని గోండులకు భూమిపై హక్కు, పట్టాలూ లభించాయి. వారి అభివృద్ధికి ప్రప్రథమంగా చట్టాలు చేయబడ్డాయి. ఈ ప్రాంతాలలో వడ్డీ వ్యాపారం క్రమబద్ధం అయింది. వారికి సేవ చేయడమేకాక, వారి ఆచార వ్యవహారాల గురించీ, సమస్యల గురించీ రెండు ఉద్గ్రంథాలు రాశారు. గోండుల గురించి పుస్తక జ్ఞానం సంపాదించాలంటే యీ రోజు వరకూ యీ పుస్తకాలు తప్ప అన్యం లేవు.
తన బాధ్యతను నిర్వర్తించి లండన్ తిరిగి వెళ్ళిపోయినా, ఏటా ఒకసారి సొంత ఖర్చులతో ఆదిలాబాదు వచ్చి గోండుల మధ్య మార్లవాయి గ్రామంలో కొంతకాలం గడిపి లండన్ వెళతారీయన.
ఈ ఋషితుల్యుని పుస్తకాలు చదివాను. ఆయన గురించి ఎంతో విన్నాను.
ఇప్పుడు కలిసే అవకాశం వస్తోందంటే నమ్మశక్యం కావడం లేదు. అంతకాలం ఎదురు చూసినవాడిని, తీరా ఆయన వస్తే కలవడానికి ధైర్యం చాలలేదు. మహాజ్ఞాని, స్వార్థరహిత జీవి అయిన హేమండార్ఫ్ గారెక్కడ? జీతం రాళ్ళకోసం యిక్కడ పని చేస్తున్న నేనెక్కడ?
అప్పటి ప్రాజెక్టు ఆఫీసరు చంద్రశేఖర శాస్త్రిగారు నన్ను వారికి పరిచయం చేశారు. బిడియం పోయిన తర్వాత చాలా ఫ్రీగా మాట్లాడాను. చాలసేపు అవీ యివీ మాట్లాడిన తర్వాత హేమండార్ఫ్ “నేనివాళ రాజా అత్రాం భగవంతరావు గారిని కలవాలి మీరాయన్నెరుగుదురా?” అని అడిగారు. నేను భగవంతరావుని కలిసింది ఒకసారే అ యినా “నాకు భగవంతరావు బాగా పరిచయమండీ-- ఇ ప్పుడే కబురు చేస్తాను. సాయంకాలానికి వస్తాడు” అన్నా ను. నేనలా అన్నప్పుడు ఏదో వినరాని మాట విన్నట్టు మొహం పెట్టారు హేమండార్ఫ్.
“ఎంత మాట? భగవంతరావుని మన దగ్గరకు పిలిపించడమా? ఆయన రాజకుటుంబానికి చెందినవారు. గోండులు ఇప్పటికీ ఆయన్ని రాజుగా ఆరాధిస్తారు. సా మాన్యులమైన మనం ఆయన దర్శనం చేయాలిగానీ క బురంపి పిలిపించకూడదు. ఆయన్ని గౌరవిస్తే యావత్తు గోండు సమాజాన్నీ గౌరవించినట్టే. మీరందరూ సిద్ధం అయితే వెంటనే బయల్దేరుదాం.”
సిగ్గుతో చచ్చినంత పనయింది నాకు.
ఏం మాట్లాడాలో తెలియక వాహనాలవైపు దారితీశా ను. శాస్త్రిగారు, శర్మగారు (అప్పుడు ఆసిఫాబాదు సబ్ కలెక్టరు) ఎన్.వి. రాజారెడ్డి గారు, జస్టిస్ జగన్మోహనరెడ్డి గారమ్మాయి డాక్టర్ ఊర్మిళ గారు, నేనూ హేమండార్ఫ్ గారి వెంట కంచనపల్లి వెళ్లాం.
గ్రామం మధ్యలో ఒక పూరి గుడిసె ముందు జీపు ఆపారు. హేమండార్ఫ్ గారు జోళ్లు బయటే వదలి ఇంటి ఆవరణలో ప్రవేశించి “రామ్రామ్ రాజాసాబ్” అన్నారు ముకుళిత హస్తాలతో. చిరపరిచితమైన ఆ కంఠం వినగానే ఇంట్లోంచి చిరిగిన ధోవతి, బనియన్లతో వచ్చి “రామ్రామ్ సాబ్” అంటూ భగవంతరావు గారు హేమండార్ఫ్ గారిని కావలించుకున్నారు.
ఇద్దరు మిత్రుల కళ్ళల్లో అందరి ముందు బయట పడటానికి సంశయిస్తున్న అశ్రుబిందువులు.
రాజుగారిని మనం వెళ్ళి కలవాలే తప్ప పిలిపించకూడదన్న సంస్కారి హేమండార్ఫ్ గారు, కబురంపి పిలిపించడమేగాక ఆయన చేత అందరికీ కుర్చీలు, బల్లలు చేయించాలని తలపెట్టిన అధముడిని నేను. ఇద్దరమూ వేర్వేరు కారణాలవల్ల చేష్టలు దక్కి నుంచున్నాం.
తేరుకుని హేమండార్ఫ్ గారిని, భగవంతరావునీ కలిపి ఒక ఫొటో తీశాను. వారిద్దరూ కలిసిఉన్న ఫొటో అదొక్కటేనట. ఆ రోజు సాయంకాలం రాజా సాబ్ భగవంతరా వు గారినుంచి శలవు తీసికొని బయల్దేరుతుండగా ఆయ న నన్ను ప్రక్కకి పిలిచి “అయ్యా! మీకు మాటిచ్చిన విధం గా ఒక బల్ల చేస్తున్నాను. పూర్తవ్వొచ్చింది. వారం రోజుల తరువాత మీరిలా వస్తే పట్టుకు పోదురుగాని” అన్నాడు.
నేను చేతులు జోడించి “క్షమించండి రాజా సాబ్. మీరు చేసిన వస్తువులు బహుమతిగా పొందే అర్హత నాకు లేదు. నాకేకాదు, మరెవ్వరికీ లేదు ఈ భూ ప్రపంచంలో. ఆ అర్హత వున్నవాడు హేమండార్ఫ్ గారొక్కరే” అని వచ్చేశాను; భగవంతరావు గారు ఏదో చెబుతున్నా వినిపించుకోకుండా.
సిగ్గుతో ఎన్నిసార్లని చావను?
‘గోదావరి గాథలు’ నుంచి..
అలకనంద ప్రచురణలు: విజయవాడ-520008, పేజీలు: 96,
వెల: రూ.75/- ప్రతులకు: అశోక్ బుక్ సెంటర్,
విశాఖపట్నం- 530002.
ఫో॥ (0891) 2565995, 2561055,
అక్షర, హైదరాబాద్- 34, ఫో॥ (040) 23554096.