calender_icon.png 30 June, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర సాంస్కృతిక మండలి సలహాదారుడిగా అంతడుపుల నాగరాజు

30-06-2025 05:35:38 PM

మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర భాష సంస్కృతిక మండలి సలహాదారుడిగా పట్టణానికి చెందిన తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాజు(Anthadupula Nagaraju)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణానికి చెందిన నాగరాజు మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ధూంధాంను స్థాపించి, తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను జానపద కళారూపాల ద్వార ప్రజలకు వివరించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాగరాజుకు కేసీఆర్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తుందని అందరు భావించినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను పట్టించుకోలేదు.

దశాబ్ద కాలం అనంతరం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రితో సహా పలువురు రాష్ట్ర మంత్రులు పలు సందర్భాల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాజుకు తగిన ప్రాధాన్యతను కల్పించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని జూన్ 2న రాజుభవన్లో నిర్వహించిన రాష్ట్ర సాంస్కృతిక సంబరాలకు నాగరాజును ఆహ్వానించి ఘనంగా సత్కరించింది. తాజాగా రాష్ట్ర భాషా సాంస్కృతిక మండలి సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల నాగరాజు హార్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తో అధికారం చేపట్టిన గత టిఆర్ఎస్ ప్రభుత్వం తనను గుర్తించక పోగా అనువనువునా అవమానించిందని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను, కళాకారులను గుర్తించి తగిన ప్రాధాన్యత నిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తనను రాష్ట్ర సాంస్కృతిక మండలి సలహాదారునిగా నియమించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు నాగరాజును సాంస్కృతిక మండలి సలహాదారునిగా నియమించడం పట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాకారులు, ఉద్యమకారులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు.