08-06-2025 06:53:34 PM
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్-2025(AP EAPCET-2025) ఫలితాలను ఆదివారం సాయంత్రం ప్రకటించారు. ఈ ఫలితాలను జేఎన్టీయు-కాకినాడ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె. ప్రసాద్(Vice-Chancellor Professor C.S.R.K. Prasad) విడుదల చేశారు. వీసీ ప్రసాద్ తెలిపిన ప్రకారం.. పరీక్షల్లో మొత్తం 75.67 ఉత్తీర్ణత శాతం నమోదు అయినట్లు వెల్లడించారు. ఈఏపీసెట్ పరీక్ష నిర్వహించిన 12 రోజులకే ఫలితాలు విడుదల చేయడం విశేషం. ఈఏపీసెట్ పరీక్ష ఏపీ, తెలంగాణ మొత్తంగా 145 కేంద్రలలో అధికారులు నిర్వహించారు. ఈ పరీక్షకు 3,62,448 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,40,300 మంది పరీక్ష రాసారు.
వీరిలో 2,57,509 మంది ఉత్తీర్ణత పొందారని వీసీ తెలిపారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది.. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణలోని హైదరాబాద్ జిల్లా వనస్థలిపురం విద్యార్థి అనిరుధ్ రెడ్డి తొలి ర్యాంకు సాధించగా, శ్రీకాళహస్తికి చెందిన భానుచరణ్ రెడ్డి రెండో ర్యాంకు పొందాడు. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో పెనమలూరూకు చెందిన సాయి హర్షవర్ధన్ తొలి ర్యాంకు సాధించగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన నిషాంత్ రెండో ర్యాంకు పొందాడు.