చేయూత పింఛన్లకు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి,(విజయక్రాంతి): చేయూత సామాజిక భద్రత పింఛన్ల మంజూరుకు అర్హులైన కొత్త లబ్ధిదారులు ఆగస్టు 31లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో డీఆర్డీఓతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లు గీత, చేనేత కార్మికులు, బోదకాలు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హిమోఫిలియా వంటి రక్త రుగ్మతలతో బాధపడుతున్న అర్హులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ప్రజాపాలన, 99 రోజుల గ్రామసభలు, ప్రజావాణిలో ఇప్పటికే ఆధారాలతో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. అర్హులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు దరఖాస్తులు సమర్పించి తప్పనిసరిగా రసీదు పొందాలని సూచించారు.ఈ సమావేశంలో డీఆర్డీఓ బాలకృష్ణ, డీపీఎం రవి తదితరులు పాల్గొన్నారు.






