ఆర్థిక ఆరోపణలపై మంథని ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్
విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు
ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ చేపట్టిన జిల్లా యంత్రాంగం
పెద్దపల్లి,(విజయక్రాంతి): మంథని మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కె.ఎన్. జయ ప్రకాశ్ ఆర్థిక ఆరోపణలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి సంబంధించి సస్పెన్షన్కు గురయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఆగస్టు 7న మంథని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, సర్పంచ్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు జయ ప్రకాశ్పై పలు ఆరోపణలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన జిల్లా యంత్రాంగం ప్రాథమిక విచారణ చేపట్టింది.
ప్రాథమిక విచారణలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, విధుల పట్ల అంకితభావం లోపించడం, ప్రభుత్వ ఉద్యోగికి తగని ప్రవర్తన వంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ప్రవర్తనా) నిబంధనలు–1964లోని రూల్ 3(1), 3(2) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో శాఖాపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) రూల్స్–1991లోని రూల్ 20 ప్రకారం శాఖాపరమైన విచారణ చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
విచారణ పూర్తయ్యే వరకు అదే నిబంధనల్లోని రూల్ 8(1) ప్రకారం జయ ప్రకాశ్ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశించారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కాలానికి జీవనాధార భత్యంతో పాటు డీఏ, ఇతర పరిహార భత్యాలు చెల్లించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నిబంధనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా, అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా పనిచేయాలని సూచించారు.






