06-02-2026 12:47:25 AM
మేడ్చల్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం కోఆర్డినేటర్లను నియమించింది. ఇదివరకే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పగా తాజాగా కోఆర్డినేటర్లను సైతం నియమించి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీరు పార్టీలో శ్రేణుల మధ్య సమన్వయంతోపాటు అభ్యర్థుల విజయానికి కృషి చేయనున్నారు.
మేడ్చల్ జిల్లాలో మున్సిపాలిటీలకు స్థానిక నేతలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి ని కోఆర్డినేటర్లుగా నియమించింది. అలియాబాద్ మున్సిపాలిటీకి స్థానిక మాజీ జడ్పిటిసి సభ్యుడు నక్క ప్రభాకర్ గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపాలిటీకి డిసిసి మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, ఎల్లంపేట మున్సిపాలిటీకి స్థానిక మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిని పిసిసి కోఆర్డినేటర్ గా నియమించింది.
మేడ్చల్ జిల్లా నేతలకు ఇతర జిల్లాల్లో..,.
మేడ్చల్ జిల్లాలో కేవలం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. కుతుబుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నాయి. ఈ నియోజకవర్గాల ముఖ్య నాయకులకు ఇతర జిల్లాల్లోని మున్సిపాలిటీలకు కోఆర్డినేటర్ గా నియమించారు.
కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన బండి రమేష్ ను తూప్రాన్, శ్రీరంగం సత్యాన్ని ఇస్నాపూర్, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనాంపల్లి హనుమంతరావును మెదక్, కుతుబుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ను గజ్వేల్, ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన పరమేశ్వర్ రెడ్డిని భువనగిరి మున్సిపాలిటీ కో ఆర్డినేటర్లుగా నియమించారు.