పైసలు ఇస్తేనే భవన నిర్మాణ అనుమతులా?
గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజల వినూత్న నిరసన
గజ్వేల్, జూన్ 3: సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో భవన నిర్మాణ అనుమతుల మంజూరుపై అధికారుల వ్యవహారశైలిని నిరసిస్తూ బాధితులు బుధవారం మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటుకు ఫ్లెక్సీ కట్టి వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. చట్టబద్ధమైన పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసిన సామాన్యులకు నెలల తరబడి అనుమతులు మంజూరు చేయకుండా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని వారు ఆరోపించారు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉన్నప్పటికీ తమ దరఖాస్తులు పెండింగ్లో ఉంచుతున్నారని, మరోవైపు ప్రభుత్వ భూములు, వక్ఫ్ బోర్డు స్థలాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు మాత్రం వేగంగా అనుమతులు ఇస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సామాన్యులకు ఒక విధానం, అక్రమార్కులకు మరో విధానం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ కార్యాలయంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించిన బాధితులు, సంబంధిత సిబ్బంది, అధికారులపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా మంజూరైన అనుమతులను రద్దు చేసి, అర్హులైన దరఖాస్తుదారులకు వెంటనే అనుమతులు జారీ చేయాలని కోరారు. మున్సిపల్ కార్యాలయం గేటుకు ఫ్లెక్సీ కట్టి నిరసన తెలపడం పట్టణంలో చర్చనీయాంశంగా మారగా, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల స్పందన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.






