24-07-2025 01:21:14 AM
- రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి రోజులు
- మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజం
హైదరాబాద్, జులై 23 (విజయక్రాంతి): ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలను నిషేధిస్తూ మెమో ఇచ్చారని, నేడు లైబ్రరీల్లో విద్యార్థులపై ఆంక్షలు విధిస్తున్నారని బుధవారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఆయన విమర్శించారు.
ప్రజాస్వామ్య పాలన అనే ఏడో గ్యారంటీని మరిచి ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెస్తున్నారని, లైబ్రరీలను రాజకీయ వేదికలుగా మార్చిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్దని హరీశ్రావు ఆరోపించారు. ఇప్పుడు సుద్దపూస మాటలు, నీతులతో బోర్డులు పెట్టినంత మాత్రాన పాపపరిహారం కాదని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రాజకీయమంతా లైబ్రరీల చుట్టే జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. రాహుల్ గాంధీని సైతం లైబ్రరీకి తీసుకొచ్చి బూటకపు హామీలు ఇచ్చిన సంగతి మరిచిపోయారా, అధికారంలోకి రాగానే అవి రాజకీయ వేదికలు కావు, గ్రంథాలయాలు అని గుర్తుకు వచ్చాయా అని ఆయన ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని మీ నాయకుడిని విద్యార్థులు నిలదీసినందుకు, ఈరోజు గ్రంథాలయాల్లో నిషేధాజ్ఞలు ఏర్పాటు చేస్తారా అని హరీశ్రావు ప్రశ్నించారు.
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక విధంగా, అధికారం లోకి రాగానే మరొక విధంగా వ్యవహరిస్తారా? విద్యార్థులే కాదు, యావత్ తెలంగా ణ మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తున్నదని ఆయన మండిపడ్డారు. 20 నెలల్లో 12 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మీ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని హరీశ్రావు ధ్వజమెత్తారు.
నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యో గులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే, సీఎం ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని, ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
డయేరియాతో ఊరంతా మంచం పట్టింది..
కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడి ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని బుధవారం ఎక్స్లో హరీశ్రావు ప్రశ్నించారు. కలుషిత నీరు తాగి తండ్రి, కొడుకులు మృతి చెందటం అత్యంత బాధాకరమని, శుభ్రమైన తాగునీటి సరఫరాలో రూరల్ వాటర్ సప్లయ్ విభాగం, పారిశుధ్య నిర్వహణలో పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్, నష్టనివారణ చర్యలు చేపట్టడంలో రెవెన్యూ డిపార్ట్ మెంట్ ఫెయిల్ అయ్యాయని ఆరోపించారు. మొత్తంగా పల్లెలు, గ్రామాల ప్రజలకు సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. దేమికలాన్ గ్రామంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి, వెంటనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.