మూడెకరాల వరకు రైతు భరోసా
రెండో విడతలో 10.68 లక్షల మందికి..
- రైతుల ఖాతాల్లో రూ.1,590 కోట్లు జమ
- రెండు దశల్లో 54.96 లక్షల మందికి లబ్ధి
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి) : వానాకాలం సీజన్కు సంబం ధించి ‘రైతుభరోసా’ పెట్టుబడి సాయం పంపిణీ రెండో రోజు బుధవారం కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండు నుంచి మూడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసింది. 26.50 లక్షల ఎకరాల సాగు భూమికి గాను 10.68 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,590.02 కోట్లు వేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
మొదటి, రెండో విడత కలిపి 54.96 లక్షల మంది రైతులకు రూ.4,072.04 కోట్ల పెట్టుబడి సాయం అందజేసినట్లు మంత్రి వెల్లడించారు. విడతల వారీగా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. మొదటి దశలో రెండు ఎకరాల వరకు 44.27 లక్షల మంది రైతులకు 2482.02 కోట్ల విడుదల చేయగా, మలి విడతలో 2 నుంచి 3 ఎకరాల వరకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. సిద్దిపేటలో 6 వేల బస్తాల యూరియాను మాయం చేసిన డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
యూరియా యాప్ వల్లే అక్రమాలను గుర్తించినట్లు చెప్పారు. అక్రమాలకు పాల్పగితే సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం రాజీపడదన్నారు. ఎరువుల పంపిణీలో పారదర్శత కోసం యూరియా యాప్ను సర్థవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.






