మంత్రి పొంగులేటి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సిరిసిల్ల, మే 15 (విజయ క్రాంతి): రెవెన్యూ, హౌసింగ్ ఐ&పి.ఆర్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు.
మంత్రుల పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే లతో కలిసి చేయాల్సిన ఏర్పాట్ల పై విప్ గురువారం రుద్రంగి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రంగి మండల కేంద్రానికి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వస్తారని తెలిపారు.
రుద్రంగి మండలంలో మంజూరైన 243 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం కూడా హౌసింగ్ శాఖ మంత్రి చేతులమీదుగా జరుగుతుందని తెలిపారు. రుద్రంగిలో ఇంటి కోసం పేదలు చేసుకున్న దరఖాస్తులు ఇంకా ఏమైనా పెండింగ్ లో ఉంటే వెంటనే మంజూరు చేయాలని జిల్లా ఉన్నతాధికారులను విప్ ఆదేశించారు.
మంత్రి పర్యటనకు రైతులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.రాధాబాయ్ , రుద్రంగి తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీవో నటరాజ్, ఈఈ ఆర్ & బీ వెంకట రమణయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ హౌసింగ్ శంకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






